షూటింగ్ పూర్తయిన 40 ఏళ్లకు విడుదలైన తెలుగు స్టార్ హీరో సినిమా
గతంలో సినిమాలను నిర్మాత, దర్శకులు చకచకా పూర్తిచేసేవారు. అందుకు హీరోలు సహకరించేవారు. కానీ ఇప్పుడు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. స్క్రిప్ట్ బాగా రావాలనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి దానిపైనే కూర్చొని నిర్మాతలను పూర్తిగా తినేసి ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నారు. సినిమా ప్రారంభమైన తర్వాత విడుదలవడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతోంది. ఏ స్టార్ హీరో సినిమా అయినా ప్రస్తుతం ఇదే పరిస్థితి. సినిమాను త్వరగా విడుదల చేసి దీనిపై ఆధారపడినవారిని ఆదుకుందామనే ఆలోచనే ఎవరికీ లేదు. ఇదీ నేటి హీరోల పరిస్థితి. ఇదంతా పక్కన పెడితే మన తెలుగులో ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత 40 సంవత్సరాలకు థియేటర్లలోకి వచ్చింది.
తప్పుకున్న సింగీతం శ్రీనివాసరావు
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ హీరో హీరోయిన్లుగా ప్రతిబింబాలు సినిమా మొదలైంది. కొంత షూటింగ్ జరిగిన తర్వాత అక్కినేనికి గుండెపోటు రావడంతో కొన్నాళ్లు షూటింగ్ వాయిదా పడింది. తర్వాత ప్రారంభించే సమయానికి జయసుధ కాల్షీట్లు ఖాళీలేవు. అలా కొన్నాళ్లు గడిచేసరికి ఈ సినిమా నుంచి సింగీతం తప్పుకున్నారు. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఎట్టకేలకు అవాంతరాలన్నీ అధిగమించి షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటంతో విడుదలకు నోచుకోలేదు.

పట్టుదలగా ప్రయత్నించిన రాధాకృష్ణమూర్తి
ఈ సినిమా నిర్మాత రాధాకృష్ణమూర్తి మాత్రం ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని పట్టుదలగా ప్రయత్నించారు. నేటి తరానికి తగినట్లుగా డీఐ కలర్ కరెక్షన్ తోపాటు డీటీఎస్ సౌండ్ సిస్టం కూడా యాడ్ చేశారు. ఎట్టకేలకు 2022 సెప్టెంబరు 20వ తేదీన అక్కినేని జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా విడుదలయ్యే సమయానికే అక్కినేని నాగేశ్వరరావుతోపాటు, దర్శకుడు ప్రకాశరావు కూడా కన్నుమూశారు. ఈ సినిమాకు సంగీత దర్శకత్వాన్ని అందించిన చక్రవర్తి కూడా మరణించారు. ఇలా సినిమా విడుదలకు ముందే ఇందులో తలో చేయివేసినవారంతా కొందరు మరణించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు.












Click it and Unblock the Notifications