'గుంటూరు కారం' వదులుకున్న స్టార్ హీరో ఎవరంటే..?
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ దీన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలందిస్తున్నారు. ఏ ముహూర్తాన ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారో కానీ అప్పటినుంచి అన్నీ అవరోధాలే. ఒకానొక దశలో అసలు ఈ సినిమా షూటింగ్ జరగదేమో.. విడుదలవడం కూడా కష్టమని మహేష్ బాబు అభిమానులే అభిప్రాయపడ్డారంటే ఎటువంటి పరిస్థితుల మధ్య ఇది షూటింగ్ ను పూర్తిచేసుకుందో అర్థమవుతూనే ఉంది.
పూజా హెగ్డేను కథానాయికగా అనుకున్నారు. అయితే డేట్లు సర్దుబాటు కాక ఆమె తప్పుకుంది. పూజా తప్పుకోవడానికన్నా ముందు షూటింగ్ కొంత జరిగి కొద్దిరోజులు ఆగిపోయింది. పవన్ కల్యాణ్ సినిమా బాధ్యతలు చూడాల్సి ఉండటంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల కొంత ఆలస్యమైంది. పూజా బదులు శ్రీలీల ప్రధాన హీరోయిన్ అవగా, మీనాక్షి చౌదరి కొత్తగా వచ్చి చేరింది. దీనితర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ను మారుస్తున్నారంటూ మొన్నటివరకు వార్తలు వచ్చేవి. ప్రతిసారీ తమన్ వాటిని ఖండిస్తూ వచ్చాడు.

డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీతోపాటు మరికొందరు సాంకేతిక నిపుణులు కూడా మారిపోయారు. గతంలో ఏ సినిమాకు ఎదురవనన్ని అడ్డంకులు ఈ సినిమాకు ఎదురయ్యాయి. షూటింగ్ జరగడంలేదు.. అనుకున్న ప్రతిసారీ కుటుంబంతో కలిసి మహేష్ బాబు విదేశాలకు వెళ్లిపోయేవారు. అవాంతరాలు పూర్తిచేసుకొని జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట గుంటూరు కారం కథను మహేష్ బాబు కోసం అనుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ ను దృష్టిలో పెట్టుకొని రాశారు. గతంలో తారక్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా పట్టాలెక్కలేదు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ దేవర చిత్రం చేస్తున్నాడు. త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాను జూనియర్ తో చేద్దామనుకోగా అది మహేష్ చేతికి వచ్చింది. ఏదేమైనప్పటికీ 13 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది.












Click it and Unblock the Notifications