రూ.కోట్లల్లో పారితోషికాలు.. రూపాయి ఇవ్వడానికి వెనకాడుతున్నారు?
కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదలతో చాలా ప్రాంతాలు నాలుగు రోజుల నుంచి నీళ్లల్లోనే ఉన్నాయి. బాధితులకు సహాయం చేయడానికి ప్రభుత్వాలతోపాటు రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చి సాయం చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా బాధితులకు ఆహారం, పాలు, బిస్కెట్లు లాంటివి పంపిస్తున్నారు. ఇటువంటి సమయంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలంతా భారీగా విరాళాలు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అశ్వనీదత్, వెంకీ అట్లూరి, నాగవంశీ, చినబాబులాంటివారంతా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళాలిచ్చారు.
స్టార్ హీరోయిన్లంతా పరాయి భాషకు చెందినవారే
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ తెలుగులో స్టార్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నవారికి తెలుగు ప్రజలను ఆదుకోవడానికి మనసు రావడంలేదా? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. సమంత, నయనతార, త్రిష, రష్మిక, అనుష్క, పూజా హెగ్డే, శ్రీలీల, కాజల్ అగర్వాల్, తమన్నా, కీర్తిసురేష్, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్, నిధి అగర్వాల్, మృణాల్ ఠాకూర్, జాన్వీకపూర్, కియారా అద్వానీ, రాశీ ఖన్నా.. తదితర హీరోయిన్లంతా తెలుగు సినిమాలద్వారా కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకొని మూట కట్టుకొని దాచుకున్నారు. అందులో నుంచి ఎంతో కొంత తమకు తోచిన రీతిలో వరద బాధితులకు సహాయం చేయడానికి మనసు రావడంలేదా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

భేష్ అనిపించుకున్న అనన్య నాగళ్ల
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మాత్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చరో రెండున్నర లక్షల రూపాయల చొప్పున పంపించింది. హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న అనన్య చేసిన మంచిపనిని స్ఫూర్తిగా తీసుకొని ఇతర హీరోయిన్లు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. కోట్లకు కోట్ల రూపాయలు పారితోషికాలు తీసుకునే ఇతర భాషా హీరోయిన్లను హీరో, దర్శక, నిర్మాతలు ప్రోత్సహించడం మానుకొని తెలుగువారికి అవకాశం కల్పించాలంటున్నారు. పరాయి భాషకు, పరాయి రాష్ట్రానికి చెందినవారికి ఇక్కడి ప్రజల కష్టనష్టాలు ఎలా తెలుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరాయి రాష్ట్రం నుంచి వస్తారు.. నాలుగు సినిమాలు చేస్తారు.. నాలుగు రాళ్లు వెనకేసుకొని వెళ్లిపోతారు. అంతకుమించి స్వచ్ఛం సేవ చేసే సమయం వారికి ఎక్కడ ఉంటుందిలే అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇటువంటి సందర్భాలు తలెత్తినప్పుడు గతంలో కొందరు హీరోయిన్లు స్పందించారు. ఇప్పుడు మాత్రం ఎవరూ మాట్లాడటంలేదు.












Click it and Unblock the Notifications