తెలుగు హీరోల మధ్య గొడవలు, విభేదాలు.. సబబేనా?
టాలీవుడ్ సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య వృత్తిపరమైన పోటీ గట్టిగా ఉండేది. స్టార్డమ్ పెరిగే కొద్దీ ఇద్దరి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. ముఖ్యంగా పారితోషికాల విషయంలో, అలాగే ఎన్టీఆర్ రాజకీయంలోకి వచ్చాక ఏఎన్నార్ సన్మానం వివాదం వల్ల వీరి మధ్య దూరం పెరిగింది. అయితే, ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా విమర్శలు చేసుకోలేదు. సూపర్ స్టార్ కృష్ణకు, ఎన్టీఆర్కు మధ్య ఉన్న విభేదాలు అప్పట్లో చాలా ఓపెన్గా సాగాయి. ఎన్టీఆర్ పాత్రలకు పోటీగా కృష్ణ సినిమాలు తీయడమే కాకుండా, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక కృష్ణ కాంగ్రెస్ వైపు నిలిచారు. ఎన్టీఆర్ ప్రభుత్వ పాలనను వ్యంగ్యంగా విమర్శిస్తూ 'సాహసమే నా ఊపిరి', 'మండలాధీశుడు' వంటి పొలిటికల్ సెటైర్ సినిమాలు తీసి కృష్ణ అప్పట్లో సంచలనం సృష్టించారు.
చిరంజీవి, మోహన్ బాబు విచిత్ర బంధం
మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మధ్య ఒక విచిత్రమైన బంధం నడిచింది. గతంలో 'మా' ఎన్నికలు, ఇండస్ట్రీ వజ్రోత్సవాల సమయంలో వీరి మధ్య విభేదాలు బహిరంగంగానే స్టేజీలపై కనిపించాయి. చిరంజీవిని ఉద్దేశించి మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపినా, ప్రస్తుతం ఇద్దరూ మెచ్యూర్డ్గా వ్యవహరిస్తూ స్నేహంగా ఉంటున్నారు. టాలీవుడ్లో అత్యంత సుదీర్ఘంగా నడిచిన గొడవల్లో చిరంజీవి - రాజశేఖర్ వివాదం ఒకటి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర్ దంపతులు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత 'మా' సభలో చిరంజీవి మాట్లాడుతుండగా, రాజశేఖర్ స్టేజ్ పైకి వచ్చి మైక్ లాక్కొని రచ్చ చేయడం పెద్ద వివాదంగా నిలిచింది. ఇటీవల వీరి మధ్య ప్యాచ్-అప్ అయింది.

బాలయ్య - అక్కినేని కుటుంబం
నందమూరి బాలకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు అక్కినేని కుటుంబంతో వివాదానికి కారణమయ్యాయి. ఒక ఫంక్షన్లో బాలకృష్ణ ఫ్లోలో.. "ఆ తొక్కినేని, నాగేశ్వరరావు.." అనడం అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్కు ఆగ్రహం తెప్పించింది. వారు సోషల్ మీడియాలో దీనిని తప్పుబట్టగా, ఆ తర్వాత బాలకృష్ణ క్లారిటీ ఇస్తూ అది కేవలం క్యాజువల్గా అన్న మాట మాత్రమేనని సర్దిచెప్పారు. వ్యక్తిగతంగా కాకపోయినా రాజకీయ సిద్ధాంతాల పరంగా పవన్ కళ్యాణ్ - ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిచింది.
ప్రకాష్ రాజ్ లెఫ్ట్ ఐడియాలజీ, పవన్ కళ్యాణ్ కూటమి రాజకీయాల నేపథ్యంలో వీరి మధ్య పొలిటికల్ కామెంట్స్ గట్టిగా నడిచాయి. తిరుమల లడ్డూ వివాదం సమయంలో కూడా ఇద్దరి మధ్య ట్విట్టర్ (X) వేదికగా పెద్ద వాగ్వాదమే జరిగింది. ప్రస్తుత జనరేషన్ హీరోలైన మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ల మధ్య బాక్సాఫీస్ పోటీ ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా వారంతా చాలా క్లోజ్గా ఉంటూ ఇండస్ట్రీలో హెల్తీ వాతావరణాన్ని కొనసాగిస్తున్నారు.














Click it and Unblock the Notifications