స్టార్ హీరోలు వద్దన్న బ్లాక్ బస్టర్ సినిమాలు
కథ వినగానే ఇది క్లిక్ అవుతుందని అంచనా వేయడం ఒక ఎత్తయితే.. రకరకాల కారణాలతో ఆ అవకాశాన్ని ముందే వదులుకోవడం మరొక ఎత్తు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ, మరో హీరో చేతికి వెళ్ళి 'ఇండస్ట్రీ హిట్' లేదా 'బ్లాక్ బస్టర్'గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. డేట్స్ కుదరకపోవడం, జానర్ నచ్చకపోవడం లేదా ఫ్యాన్స్ ఏమనుకుంటారోనన్న భయం.. కారణ ఏదైనా స్టార్ హీరోలు మిస్ చేసుకుని, ఆ తర్వాత వేరే హీరోల కెరీర్ను మలుపు తిప్పిన కొన్ని సంచలనాత్మక చిత్రాల గురించి తెలుసుకుందాం.
కందిరీగ (రవితేజ నుంచి రామ్ పోతినేని)
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్లో నిలిచిపోయే మాస్ కమర్షియల్ హిట్లలో 'కందిరీగ' ఒకటి. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో రామ్ యూత్, మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అయితే, నిజానికి ఈ కథ మొదట 'మాస్ మహారాజా' రవితేజ దగ్గరికే వెళ్ళింది. అప్పట్లో ప్రసిద్ధ దర్శకుడు కృష్ణవంశీ కాంబినేషన్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కాల్సి ఉంది. కానీ, రవితేజ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉండటంతో ఈ ఆఫర్ను వదులుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రంలో రామ్ నటించి బ్లాక్ బస్టర్ కొట్టాడు.

శతమానం భవతి (సాయిధరమ్ తేజ్ నుంచి శర్వానంద్)
2017 సంక్రాంతి కానుకగా వచ్చి జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్న కుటుంబ కథా చిత్రం 'శతమానం భవతి'. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శర్వానంద్, అనుపమ జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొదట సాయిధరమ్ తేజ్ వద్దకు వెళ్లింది. కానీ, ఆ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. సరిగ్గా అదే సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ 'ఖైదీ నంబర్ 150' పోటీలో ఉండటంతో, బాబాయ్ సినిమాకు పోటీగా రావడం ఇష్టం లేక తేజు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అంతేకాదు, ఈ కథకు శర్వానంద్ అయితేనే సరైన న్యాయం చేయగలడని సూచించడంతో అలా ఈ ప్రాజెక్ట్ శర్వా చెంతకు చేరి క్లాసిక్ హిట్గా నిలిచింది.
బొమ్మరిల్లు (యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సిద్ధార్థ్)
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో వచ్చి టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన చిత్రం 'బొమ్మరిల్లు'. దర్శకుడు భాస్కర్ పేరే 'బొమ్మరిల్లు భాస్కర్'గా మారిపోయిందంటే ఈ సినిమా ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సిద్ధార్థ్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన ఈ పాత్ర కోసం నిర్మాతలు మొదట యంగ్ టైగర్ ఎన్టీఆర్ను అనుకున్నారట. అయితే, అప్పటికే ఎన్టీఆర్ మాస్ హీరోగా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాంటి సమయంలో అత్యంత సున్నితమైన ఈ క్లాస్ సబ్జెక్ట్ చేస్తే అభిమానులు ఏమనుకుంటారోనన్న సందేహంతో ఎన్టీఆర్ ఈ కథను పక్కన పెట్టారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ సిద్ధార్థ్ వద్దకు వెళ్లడం, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కావడం జరిగిపోయాయి.
దేశముదురు (సుమంత్ నుంచి అల్లు అర్జున్)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చి బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రం 'దేశముదురు'. బన్నీని సరికొత్త మాస్ లుక్లో నిలబెట్టిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్టోరీ మొదట హీరో సుమంత్ దగ్గరకు వెళ్లిందట. అయితే, ఏవో అనివార్య కారణాల వల్ల సుమంత్ ఈ కథను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం అల్లు అర్జున్ను వరించింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ మాస్ ఆడియన్స్లో తిరుగులేని ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. సుమంత్ తొలిప్రేమ సినిమాను కూడా మిస్ చేసుకున్నాడు. ఇలా ఒకరి నుంచి మరొకరి వద్దకు చేరి చరిత్ర సృష్టించిన సినిమాలు టాలీవుడ్లో ఎన్నో ఉన్నాయి. ఒకరి వదులుకున్న కథే మరొకరి జాతకాన్ని మార్చేస్తుందనడానికి ఇవే సరైన ఉదాహరణలు!














Click it and Unblock the Notifications