వేణుస్వామి చాలా తక్కువ ఫీజు తీసుకుంటాడంట.. మీరు కూడా చెప్పించుకోండి!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు, సినీ వినోదాలకు ఎంత ఆదరణ ఉందో... సెలబ్రిటీల జాతకాలు, జ్యోతిష్యుల జోస్యాలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ప్రముఖ వివాదాస్పద జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు వినపడని రోజంటూ ఉండదు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై, జాతకాలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. కొన్ని విమర్శలు, విచారణలు, వివాదాల కారణంగా కొద్దికాలం సైలెంట్గా ఉన్న ఆయన, మళ్లీ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. అయితే, సినీ నటీనటులు, హీరోయిన్లతో ప్రత్యేక పూజలు, హోమాలు చేయించే వేణు స్వామి... జాతకం చెప్పడానికి ఎంత ఫీజు తీసుకుంటారనే ప్రశ్న చాలామందిలో ఉంది.
వార్తలను ఖండించిన వేణుస్వామి
వేణు స్వామి జాతకం చెప్పాలంటే లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందేనంటూ సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు సాగుతుంటాయి. అయితే ఈ వార్తలను ఆయన తాజాగా పూర్తిగా ఖండించారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ప్రముఖ జ్యోతిష్యులు జాతక పరిశీలన కోసం 16,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కానీ తాను మాత్రం కేవలం 6,000 రూపాయల ఫీజు మాత్రమే తీసుకుంటానని స్పష్టం చేశారు. గత రెండేళ్లుగా తన ఫీజులో ఎలాంటి మార్పు లేదని, కింద నుంచి లెక్కేస్తే అత్యంత తక్కువ ఫీజు తీసుకునే జ్యోతిష్యులలో తాను నాలుగో స్థానంలో ఉంటానని చెప్పుకొచ్చారు.

పరిహారాలకు పూజలు
జాతక పరిశీలన మాత్రమే కాకుండా పరిహార పూజలు చేయించడంలోనూ తనదైన ప్రత్యేక శైలిని పాటిస్తానని వేణు స్వామి తెలిపారు. వందల కోట్ల ఆస్తిపరులకు లేదా 10 కోట్ల రూపాయిల స్థోమత ఉన్నవారికి 5 లక్షల రూపాయిల పూజలు సూచిస్తే, ఆర్థికంగా అంత వెసులుబాటు లేని సామాన్యులకు వారి బడ్జెట్కు అందుబాటులో ఉండే పూజలను మాత్రమే సజెస్ట్ చేస్తానని అన్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తిని ముందుగా ఒడ్డున పడేసి, వారు ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే పెద్ద పూజల జోలికి వెళ్తానని వివరించారు. ఎక్కువగా శ్రీకాళహస్తి, త్రయంబకేశ్వర్, తిరునల్లారు, కామాఖ్య వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లోనే ఈ పూజలు నిర్వహిస్తుంటారని తెలిపారు.
నెగెటివ్ అంశాలు చెప్పడంతోనే వ్యతిరేకత
జాతకంలో ఉన్న ప్రతికూల లేదా నెగిటివ్ అంశాలను సూటిగా చెప్పడం వల్ల తనపై కొంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమేనని, కానీ నిజాయితీగా ఉండటానికే తాను ప్రాధాన్యమిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. క్యాన్సర్ లక్షణాలతో వచ్చిన రోగికి భయపడి వ్యాధి లేదని అబద్ధం చెప్పడం కంటే, ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పి దానికి తగిన చికిత్స లేదా పరిహార మార్గాన్ని సూచించడమే ఒక నిజమైన జ్యోతిష్యుడి బాధ్యత అని వేణు స్వామి సమర్థించుకున్నారు.














Click it and Unblock the Notifications