విజయ్ 'జననాయగన్' మూవీ లీక్ కేసు.. ఆ ముగ్గురు అరెస్ట్..
తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ 'జన నాయగన్' మూవీ కేసులో కీలక పురోగతి సాధించారు తమిళనాడు క్రైం బ్రాంచ్ పోలీసులు. తాజాగా ముగ్గురు ప్రధాన నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఇతర సినిమాకు ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ గా చేస్తున్న ఓ నిందితుడు ఈ మూవీ లీక్ కు కారణమని పోలీసుల విచారణలో తేలింది. నిందితులు జననాయగన్ సినిమాను పైరసీ చేసి లీక్ చేశారని ధృవీకరించుకున్నాం. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచాం. ఆ తర్వాత జుడిషియల్ కస్టడీకి రిమాండ్పై తరలించాం. అందులో ఒకరు ఫ్రీలాన్స్ ఎడిటర్ ఉన్నారు అని పోలీసులు లేఖలో తెలిపారు. దాంతో ఇప్పటివరకు అరెస్టయిన మొత్తం నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
ఇక జననాయగన్ సినిమాకు సంబంధించి కేసు జరుగుతున్న నేపథ్యంలో ఈ మూవీని డౌన్ లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, పైరసీ కంటెంట్ ను షేరింగ్ చేయడం లాంటి వాటికి పాల్పడొద్దని తమిళనాడు క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా పైరసీకి పాల్పడుతున్నారన్న విషయం తెలిస్తే అందుకు సంబంధించిన వివరాలు, లింకులను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ కు అందించాలని సూచించారు. లేదా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్: 1930 వివరాలు అందించాలని తెలిపారు.
విజయ్ చివరి సినిమా జననాయగన్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ మూవీని సెన్సార్ సమస్య వెంటాడింది. అందువల్ల చాలా నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ నిరవధికంగా వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 23 న తమిళనాడులో పోలింగ్ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 24 న ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక జన నాయగన్ సినిమాకు హెచ్. వినోద్ దర్శకత్వం వహించాడు. యంగ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అలాగే మలయాళ బ్యూటీ మమితా బైజు, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.












Click it and Unblock the Notifications