Fact Check : కోవిన్ యాప్ హ్యాక్ అవలేదు... ఆ ప్రచారాన్ని కొట్టిపారేసిన కేంద్రం
భారత్లో కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే 'కోవిన్ పోర్టల్' హ్యంక్ అయిందంటూ జరిగిన ప్రచారం తీవ్ర దుమారం రేపింది. 'డార్క్ వెబ్ క్రిమినల్ ఇంటలిజెన్స్' అనే ట్విట్టర్ హ్యాండిల్ చేసిన ట్వీట్ ఈ దుమారానికి కారణమైంది. భారత్కు చెందిన 15 కోట్ల మంది యూజర్ల డేటాను డార్క్ లీక్ మార్కెట్లో అమ్మకానికి పెట్టారని తెలిపింది. దీంతో కోట్లాది మంది భారతీయుల డేటా హ్యాకర్ల చేతికి చిక్కి ఉంటుందన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని.. ఇది పూర్తిగా నిరాధారమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
కోవిన్ యాప్, పోర్టల్లో వ్యాక్సినేషన్ డేటాతో పాటు నమోదు చేసుకున్నవారి వివరాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.టీకా అడ్మినిస్ట్రేషన్ (కో-విన్) ఎంపవర్డ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ మాట్లాడుతూ... కోవిన్ యాప్లో యూజర్ డేటాను ఏ సంస్థతోనూ షేర్ చేయలేదని తెలిపారు.ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.డార్క్ లీక్ మార్కెట్ తరుచూ ఇలాంటి పోస్టులతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. కాబట్టి ఎవరూ ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచించారు.
సాధారణంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వ్యక్తులు తప్పనిసరిగా కోవిన్ యాప్ లేదా వెబ్సైటులో తమ వివరాలను రిజస్టర్ చేయాల్సి ఉంటుంది. కోవిన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ ఫోన్కి వచ్చిన ఓటీపీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అందులో వ్యక్తిపేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి. ఇప్పటివరకూ కొన్ని కోట్ల మంది తమ వివరాలతో కోవిన్ యాప్లో రిజిస్టర్ చేసుకున్నారు. పోర్టల్ హ్యాక్ అయిందన్న వార్తలతో వారు ఆందోళన చెందారు. అయితే హ్యాక్ జరగలేదని... అదంతా ఫేక్ ప్రచారమని కేంద్రం స్పష్టతనివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Fact Check
వాదన
కోవిన్ యాప్ హ్యాక్ అయింది. యూజర్ల డేటాను డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు.
వాస్తవం
అందులో ఎంతమాత్రం నిజం లేదు. కోవిన్ యాప్ హ్యాక్ అవలేదు.