ఒమన్ తీరంలో నౌకపై భీకర దాడి.. 24 మంది భారతీయులు..
ఒమన్ తీరంలో 'సెట్టెబెల్లో' పేరుగల వాణిజ్య నౌకపై జరిగిన దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం ఖండించింది. ఈ నౌకలో ఉన్న 24 మంది భారతీయుల్లో 21 మందిని రక్షించామని, మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొంది. ఒమన్ రాజధాని మస్కట్ లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.
"ఒమన్ తీరం వెంబడి వాణిజ్య నౌక సెట్టెబెల్లోపై జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిలో ఇప్పటి వరకు 21 మందిని సురక్షితంగా బయటకు తీశాం. గల్లంతైన ముగ్గురు భారతీయుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఒమన్ అధికారులతో కలిసి మా ఎంబసీ పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది" అని విదేశాంగ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.
యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO) సమాచారం ప్రకారం, పలావు దేశపు జెండాతో ప్రయాణిస్తున్న ఈ కెమికల్ అండ్ ఆయిల్ ట్యాంకర్, ఒమన్లోని సోహార్ రేవుకు ఈశాన్యంగా 20 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఇంజిన్ గదిలో మంటలు చెలరేగాయి. బ్రిటీష్ మారిటైమ్ రిస్క్ మేనేజ్ మెంట్ సంస్థ 'వాన్గార్డ్' దీనిని సెట్టెబెల్లో నౌకగా గుర్తించింది. ఒమన్ నావికాదళం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మారిన్ట్రాఫిక్ డేటా ప్రకారం, జూన్ 1వ తేదీన ఈ నౌక ఒమన్ తీరంలో చివరిసారిగా నమోదైంది.
గత వారం కూడా ఒమన్ తీరంలో 'మారివెక్స్' పేరుతో ఉన్న మరో నౌకపై దాడి జరగగా, అందులోని 24 మంది భారతీయ సిబ్బందిని కాపాడాలని ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (FSUI) కోరింది. హార్ముజ్ జలసంధి సమీపంలో ఈ నౌక ఉందని తెలియజేస్తూ, సాయం కోసం భారత నౌకాదళాన్ని యూనియన్ అభ్యర్థించింది. అప్పట్లో ఒమన్ సైనిక దళం స్పందించి సిబ్బందిని రక్షించింది.

ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఏప్రిల్ 13 నుండి ఆ ప్రాంతం మీదుగా ఇరాన్ పోర్టులకు వెళ్లే నౌకలపై అమెరికా ఆంక్షలు విధిస్తోంది. జూన్ 8న సెంటామ్ (CENTCOM) నివేదిక ప్రకారం, ఈ నియమాలను పాటించని ఏడు నౌకలను నిలిపివేశారు, 134 నౌకలను మళ్లించారు, మానవతా దృక్పథంతో 42 నౌకలను అనుమతించినట్లు అమెరికా సైనిక విభాగం పేర్కొంది.












Click it and Unblock the Notifications