కెసిఆర్ నిజాం నైజం

నిజాం లేకపోతే కమ్యూనిస్టు పార్టీలకు దిక్కు లేదు. నిజాంను ఎంత క్రూరుడిగా చిత్రీకరిస్తే కమ్యూనిస్టులకు అంత నైతిక బలం చేకూరుతుంది. అందుకే నిజాం పరిపాలనపై చిలువలు పలువలు చేసి ప్రచారం సాగించారు, సాగిస్తున్నారు. బ్రిటిష్ పాలన భారత్ లో ముగిసిన తర్వాత ఖాసిం రజ్వీ సేనను రప్పించి తాను సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించిన కాలం మాత్రం అత్యంత దారుణమైంది. ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజకార్లు సాగించిన దౌర్జన్యాలు, అత్యాచారాలు, హింసాకాండ, అరాచకం అంతా నిజాం పాలనకు అంటుకుంటుంది. అయితే ఇది మాత్రమే నిజాం పాలన కాదు. ఇంతకు మించిన వ్యవహారం ఉంది. హైదరాబాదు సంస్థానంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం, ఇతర ప్రజా ప్రయోజనాల ప్రాజెక్టుల కోసం నిజాం ప్రభుత్వం చేసిన మేలు చిన్నదేమీ కాదు.
ఫ్యూడల్ వ్యవస్థకు ఉండే అవలక్షాణాలన్నీ నిజాంకు ఉన్నాయని, అయితే నిజాం చేసిన మంచి పనులను కూడా చూడాలని కెసిఆర్ చెబుతున్న మాటలు కమ్యూనిస్టులమని చెప్పుకుంటున్న నారాయణ లాంటి వారి బుద్ధికి కూడా తట్టకపోవడం విచిత్రమే. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు వారు తిలోదకాలిచ్చి ఎంత కాలమైందో చూడాల్సిన అవసరం ఇంకా ఉండనే ఉన్నది. చరిత్ర అధ్యయనంలో నిష్పాక్షికత అత్యవసరమైన అంశం. ఆ అంశాన్ని కాదని కమ్యూనిస్టులు ఏకపక్ష రచనకు, దబాయింపులకు పూనుకున్నారు. తెలంగాణ విమోచనోద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర మాత్రమే ఉందనే ప్రచారం కూడా ఏకపక్షంగా సాగించుకుంటున్నారు. కాంగ్రెసు వారు సాయుధ పోరాటం చేశారని గానీ, ఆర్యసమాజ్ వారు పోరాటాలు చేశారని గానీ వారు చెప్పిన దాఖలాలు లేపు. చరిత్ర రచనలో ఇతరుల పాత్ర లేకుండా చేసిన, చేయడానికి ఏ మాత్రం జంకకుండా వ్యవహరిస్తున్న కమ్యూనిస్టులకు ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ రొద ఎలా వినిపిస్తుంది.












Click it and Unblock the Notifications