బాబుకు ఎంత ఘాటు ప్రేమయో!
బాబ్లీ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది, కాంట్రాక్టర్లు ఎవరనేది చంద్రబాబుకు తెలియదా అని ముఖ్యమంత్రి కె. రోశయ్య అడుగుతున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండగానే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని ఆయన చెప్పారు. అప్పుడే తెలుగుదేశం పోరాటం చేసి ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబు జవాబు చెప్తారా అనేది ప్రశ్న. ఆయన వాటికి సమాధానం చెప్పలేని స్థితిలోనే ఉండవచ్చు.
తాను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని అని చంద్రబాబు మరాఠా పోలీసుల తీరుపై దండెత్తుతూ చెప్పుకున్నారు. అంత సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నందుకు, అన్ని ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు మరాఠా పోలీసులు తనకు రాచమర్యాదలు చేయాలని అన్నారు. కానీ, సుదీర్ఘ కెరీర్ లో తెలంగాణకు ఏం చేశారని చంద్రబాబును అడిగే వారు లేకపోవడం శాపమే. బాబ్లీ నిర్మాణం అక్రమమే కావచ్చు, కానీ వారి ప్రజల పట్ల మహారాష్ట్ర నాయకుల చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఆల్మట్టి ఎత్తు పెంచడం సరైంది కాకపోవచ్చు, కానీ కర్నాటక నాయకులు ప్రజల పట్ల చూపే ఆదరణ అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల పట్ల ఇటువంటి నిజాయితీ, చిత్తుశుద్ధి చంద్రబాబుకు ఎందుకు లేకుండా పోయిందనేది ఎవరూ ఆలోచించడం లేదు. అకస్మాత్తుగా చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ పుట్టుకొచ్చిందంటే నమ్మడం సాధ్యమేనా. తెలంగాణపై తన వైఖరిని చంద్రబాబు మార్చుకోవడం వల్లనే ఉప ఎన్నికలు వచ్చాయనే విషయాన్ని మరిచిపోవడం సాధ్యమా.
తెలుగుజాతి ఆత్మగౌరవం అంటూ మరోసారి చంద్రబాబు నినాదం ఎత్తుకున్నారు. తెలుగు ఆత్మగౌరవంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం ఉందా. లేదనే తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడానికి ఇసుమంత కృషి కూడా చేయని చంద్రబాబుకు ఆ మాట అనే అర్హత ఉందా. రాయలసీమలో తప్ప ఆంధ్రప్రదేశ్ నాయకులు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టారా. ప్రజలపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నారా. ఎందుకొచ్చిన చంద్రబాబు ఘాటు ప్రేమ.