తెలంగాణ వ్యతిరేకమా?
అయితే, ఒక రకంగా జగన్ ఖమ్మం జిల్లా యాత్ర తెలంగాణకు వ్యతిరేకమైందే. ఇతర పార్టీల నాయకులకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం జగన్ యాత్రకు ఎందుకు అనుమతించిందనేది ప్రశ్న. తెలంగాణవాదులను, తెలంగాణ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేస్తూ జగన్ యాత్రకు ఆటంకాలు లేకుండా చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయినా, జగన్ యాత్రకు వ్యతిరేకత ఎదరువుతూనే ఉన్నది. అయితే, మీడియా దాన్ని చూపించడం లేదు. మీడియా సీమాంధ్ర ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉండడంతో జగన్ కు ఎదురవుతున్న వ్యతిరేకత ఎక్కువగా బయటకు రాదు.
పార్లమెంటులో సమైక్యాంధ్ర నినాదాన్ని వినిపించిన వైయస్ జగన్ కు తెలంగాణలో పర్యటించే అర్హత గానీ తెలంగాణ ప్రజల మేలు చూస్తానని చెప్పే హక్కు గానీ లేదు. తెలంగాణ విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తాను ఉన్నాననే నమ్మకం కలిగించలేని జగన్ అన్ని ప్రాంతాల నాయకుడు ఎలా అవుతాడనేది పెద్ద ప్రశ్న. వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణానికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలను పరామర్శిస్తున్న జగన్ అదే సమయంలో తెలంగాణ కోసం మరణించిన విద్యార్థుల కుటుంబాలను కూడా సందర్శిస్తే బాగుండేదేమో. నాయకుడెవరైనా అందరినీ సమానంగా చూడాలి. ప్రజలను చీల్చి ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయం చూపించే వారు సర్వామోదయోగ్యమైన నాయకుడు కాలేడు. గ్రూపు నాయకుడు మాత్రమే కాగలడు. జగన్ అన్ని ప్రాంతాల నాయకుడు కూడా కాలేడు. తన వల్ల ప్రయోజనం పొందుతున్న ఒక వర్గం, తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం అండదండలతో మాత్రమే ఆయన యాత్ర సాగుతున్నది.