వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యవాదులు ఒప్పించరెందుకు?

By కె. నిశాంత్
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలంగాణ ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. కెసిఆర్ తీరును ఒక రకంగా తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించడం లేదు. కెసిఆర్ ఎప్పుడు కాంగ్రెసుతో మిలాఖత్ అవుతారో అనే అనుమానాలు తీవ్రంగానే ఉన్నాయి. కెసిఆర్ చేతులు ఎత్తేయకుండా, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఒత్తిడిని తెలంగాణ ప్రజలు ఎదుర్కుంటున్నారు. పోలీసుల అణచివేత, ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకుని ముందుకు సాగాల్సిన అత్యవసమైన స్థితిలో వారు పడ్డారు. హైదరాబాదును పక్కన పెడితే, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు నిరంతరం సాగుతున్నాయి. తెలంగాణ కోసం పోరాటం నిరంతరంగా సాగుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరేదీ కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అల్లావుద్దీన్ అద్భుత దీపం చేతుల్లోకి వచ్చి సమస్యలన్నీ పరిష్కారమవుతాయనే అపోహ తెలంగాణ ప్రజలకు లేదు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ వంటి నేతలు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, తెలంగాణ ఏర్పాటు వల్ల పరిమితంగానైనా ప్రయోజనాలు కలుగుతాయనేది, వలస పాలకుల ఆధిపత్యం పోతుందని, దానివల్ల స్థానిక ప్రభుత్వం ఏర్పడితే సమస్యల పరిష్కారానికి దానిపై ఒత్తిడి తేవడం తమకు సులభమవుతుందని వారు భావిస్తున్నారు.

సీమాంధ్రకు చెందిన సమైక్యవాద రాజకీయ నాయకులు మాత్రం తెరాస నాయకులను దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు తమ తమ విధానాల్లో తమ తమ సొంత రాజకీయ ప్రయోజనాల కోసమైనా తెలంగాణ కోసం ఒత్తిడి పెంచుతున్నారు. ఈ స్థితిలో సమైక్యవాద రాజకీయ నాయకులు శాంతివచనాలు బోధిస్తున్నారు. శాసనసభను, పార్లమెంటును వదిలి సమైక్యవాదం గురించి మాట్లాడుతున్న రాజకీయ నాయకులు తెలంగాణ ప్రజలతో మాట్లాడడానికి ప్రయత్నించాల్సిన కర్తవ్యాన్ని ఎందుకు విస్మరిస్తున్నారనేది ప్రశ్న. తెలంగాణ ప్రాంత ప్రజల అభిప్రాయాలను, మనోభావాలను తెలుసుకుని, ఒకవేళ తెలంగాణ ప్రజలకు చైతన్యవంతులు కాదని భావిస్తే వారిని చైతన్య పరచాల్సిన బాధ్యత సీమాంధ్ర నాయకులు ప్రవర్తించాల్సిన అవసరం ఉందనే కనీస వాదననైనా ముందుకు తేవాల్సిన వాతావరణం ప్రస్తుతం ఉంది.

తెలంగాణ సమస్యను ప్రస్తావించకుండా పార్లమెంటు, శాసనసభ సజావుగా సాగిపోవాలని, సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రి పర్యటనలు తెలంగాణలో ఆటంకాలు లేకుండా జరిగిపోవాలని, తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి సీమాంధ్ర నాయకులను తెలంగాణలో తిరిగనివ్వాలని డిమాండ్లు పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అవుతుంది. తెలంగాణ ప్రజలు తాము తమకు ఆడ్డు తగలకుండా ఏం చేసినా ఫరవాలేదు, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు కూడా వారి ఆకాంక్షను ప్రతిబింబించకూడదు అనే వైఖరి ప్రజాస్వామ్యంలో ఎంత వరకు సమంజసమని అడగాల్సిన అవసరం ఉందనేది నేడు గుర్తించాల్సిన అవసరం ఉంది.

ఒక ప్రాంతం ప్రజలు ఈ ప్రభుత్వం తమకు వద్దని వాదిస్తుంటే, తమ సమస్యను రాజ్యాంగ పరిధిలో పరిష్కరించాలని కోరుతుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేస్తుంటే ఆ ప్రజలను వదిలేసి మాట్లాడడం సబబు అనిపించుకోదు. చెప్పాలంటే, ప్రస్తుత ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజల కోసం ఉంది. ఒక ప్రాంత ప్రజలు తమకు సమస్య ఉందని వీధులకు ఎక్కితే దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది. తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుల కన్నా ప్రభుత్వంపై ఆ బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రజా సమస్యలను పక్కన పెట్టేసి, తమను ప్రశాంతంగా ఉండనివ్వాలని అడగడం మంచిది కాదు. సహనం హద్దులు దాటితే, తెలంగాణ ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక దూకుడుగా వ్యవహరిస్తే తెలంగాణ రాజకీయ నాయకులది తప్పుగా కనిపించడడం కూడా సరికాదు. సమస్యను పరిష్కరించడానికి వేదికను కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంటుంది.

ఈ కాలమ్‌లో వ్యక్తమైన అభిప్రాయాలతో దట్స్ తెలుగు డాట్ కామ్‌కు ఏ విధమైన సంబంధం లేదు.

English summary
K Nishanth questioned unites andhra stand of Seemandhra leaders. As the Telangana public is agitating for statehood for Telangana, Telangana region politicians are feeling pressure. It is the duty of the Government to solve Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X