నీరు- ప్రాంతీయ విభేదాలు
శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కుడి గట్టు కాలువ ద్వారా రాయలసీమ ఆయకట్టుకు నీరు అందుతుంది. దీంతో పాత నీటి వినియోగ స్థాయిని పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాయలసీమ నాయకులు మంగళవారంనాడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం శ్రీశైలంలో 816 అడుగుల మేరకు నీరు ఉంది. అయినప్పటికీ విద్యుదత్పత్తికి శ్రీకారం చుట్టారు. దీంతో శ్రీశైలం నిండి రాయలసీమకు నీరు చేరడమనేది దుర్లభమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో జలవిద్యుదత్పత్తిని సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఆపేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
నాగార్జునసాగర్లోకి అదనంగా నీరు చేరడం లేదు. నిరుడే అంటే నిరుటి కన్నా అధ్వాన్నంగా నాగార్జున సాగర్ పరిస్థితి ఉంది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లోకి ఇప్పటి వరకు 35 టిఎంసిల నీరు మాత్రమే వచ్చి చేరింది. నిరుడు 98 టిఎంసిల నీరు వస్తేనే ఇంత దారుణం ఎప్పుడూ లేదని మొత్తుకున్నారు. ఈ ఏడాది పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. దీంతో కృష్ణా డెల్టాకు నీరు వదలడం గగనంగా ఉంది. దీంతో కృష్ణా డెల్టా రాజకీయ నాయకులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. నీటి విడుదలలో కృష్ణా డెల్టాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించడంతో తాత్కాలికంగా ఆందోళన సద్దుమణిగింది. కృష్ణా డెల్టా నాయకులు కూడా నీటి విడుదలకు వచ్చే నెల 15వ తేదీని డెడ్లైన్గా పెట్టారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ నాయకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఏదో మేరకు నీటి విషయంలో డిమాండ్లు చేసే ఆందోళనలతో కలిసి రాకపోతే తెలుగుదేశం నాయకులకు కష్టమే ఎదురువుతుంది.
ఇదిలావుంటే, జలరాజకీయాలు నడుపుతన్నారంటూ చంద్రబాబునాయుడు కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఊరికో రకంగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. ప్రాంతాలవారీగా నీటి విడుదల డిమాండ్ల విషయంలో కాంగ్రెస్లో భిన్నవైఖరులున్న మాట వాస్తవమే. రైతులు తీవ్ర సమస్యను ఎదుర్కుంటున్న ప్రస్తుత తరుణంలో వారి సమస్యలను పట్టించుకోకపోతే స్థానికంగా ఎదురయ్యే కష్టాలు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు తెలుసు. అందుకే ఈ సమస్యను ప్రతిపక్షాలు ప్రధానం చేసుకున్నాయి.
ఏమైనా కృష్ణా నది జలాల కోసం పోరాటాలు తీవ్ర స్థాయిని అందుకునే ప్రమాదం ఉంది. ప్రాంతీయ విభేదాలు రాజకీయ వివాదాల కారణంగా మరింత ముదిరే ముప్పు పొంచి ఉంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండితే తప్ప రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీరందుతుంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశావహంగానే ఉంది.
దశాబ్దాలుగా గోదావరినదిపై తలపెట్టిన నీటి ప్రాజెక్టుల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యం నేడు ప్రాంతీయ విభేదాలకు ఆజ్యం పోస్తోంది. నిజానికి గోదావరిలో జలాలకు కొరత లేదు. కృష్ణా నదిలోని ఆంధ్రప్రదేశ్కు చెందిన హామీ జలాలు ఎన్ని ఉన్నాయో అంతగా గోదావరి నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతోంది. ఇప్పటికైనా గోదావరి నదీ జాలాల వినియోగంపై దృష్టి పెడితే సమస్య చాలా వరకు పరిష్కారం కావచ్చు. గోదావరి నదిపై తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయే తప్ప వాటిని చిత్తశుద్ధితో పూర్తితో చేయడానికి కృషి చేయడం లేదు.