ఆ ముగ్గురు : సిబిఐ నిర్వాకం
ముస్లిం రైటర్స్ ఫోరం హైదరాబాద్లో ఈ నెల 17, 18 తేదీల్లో పెద్ద యెత్తున రెండు సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సు తెలుగులో ముస్లిం సాహిత్య సృజనకు సంబంధించింది. తెలుగులో ముస్లింలు కవిత్వం రాయడం ప్రారంభించి చాలా ఏళ్లే అయింది. ఇస్మాయిల్, దేవీప్రియ, స్మైల్, గౌస్, సత్యాగ్ని, కౌముది, దిలావర్ వంటివారు చాలా కాలం నుంచే తెలుగులో సాహిత్య సృజన చేశారు, చేస్తున్నారు. అయితే ముస్లింలు ముస్లింలుగా మాట్లాడటం, అంటే భారత సమాజంలో తమ అస్తిత్వాన్ని అన్వేషించుకోవడం మాత్రం బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాతనే ప్రారంభమైంది. 1991లో ఖాదర్ మొహియుద్దీన్ రాసిన పుట్టుమచ్చ కవితతో ఇది మొదలైంది.
బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ముస్లింలు తమ మూలాలను, తమ అస్తిత్వాన్ని, దేశంలో తమ పౌర స్థితిని అన్వేషిస్తూ ప్రశ్నలు లేవనెత్తడం మొదలైంది. తాము ఈ దేశ పౌరులమేనంటూ ప్రకటించుకోవాల్సిన ఆగత్యంలో పడిన ముస్లింలు తమ అస్తిత్వాన్ని వెతుక్కోవాల్సిన అనివార్య స్థితిలో పడ్డారు. ఆ గుర్తింపుతో సాగిన, సాగుతున్న సాహిత్యమే ముస్లిం వాద సాహిత్యంగా ముందుకు వచ్చింది. ముస్లిం స్పృహతో విస్తృతంగా సాహిత్యం వచ్చింది. తమను తాము భారతీయులుగా ప్రకటించుకుంటూ అగ్రవర్ణాల ఆధిపత్యంపై, హిందూ మతఛాందసంపై, ఇస్లాం మతంలోని పెడధోరణులపై, అణచివేత ధోరణులపై నిరసనగా, ఆగ్రహంగా ముస్లిం సాహిత్యం వెలువడుతోంది.
ఆ క్రమంలోనే జల్జలా, జిహాద్, ఆజా కవితా సంకలనాలు వెలువడ్డాయి. రాష్ట్రంలోని 40 మంది ముస్లిం రచయితల కథలతో వతన్ అనే కథా సంకలనం వెలువడింది. ఫత్వా (ఖాజా), ముఖౌటా (హనీఫ్), జఖమ్ (అలీ), నఖాబ్ (షాజహానా) వంటి వ్యక్తిగత కవితా సంపుటులు కూడా వెలువడ్డాయి. హరేక్ మాల్ (అలీ), బా (రహమతుల్లా) వంటి కథా సంకలనాలు కూడా వచ్చాయి. వేముల ఎల్లయ్య, స్కైబాబ సంపాకత్వంలో ముల్కి అనే సాహిత్య సంచిక వెలువడింది. దీన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్వారు పుస్తక రూపంలో అచ్చేశారు.
ఈ రెండు రోజుల సదస్సులో ఇంకా పలు పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. 40 మంది కవుల కవితలతో వచ్చిన అలావా సంకలనం, స్కైబాబ జగ్నేకీ రాత్ కవితా సంపుటి, షేక్ హుసేన్ సత్యాగ్ని పాచికలు కథా సంపుటి, వ్యాసాల సంపుటులను ఈ సదస్సు సందర్భంగా ఆవిష్కరిస్తారు.
సదస్సును ఈ నెల 17వ తేదీ ఉదయం ప్రముఖ సాహితీవేత్త కొలకలూరి ఇనాక్ ప్రారంభిస్తారు. కర్ణాటకకు చెందిన సారా అబూబకర్, ప్రముఖ సాహితీవేత్త శివసాగర్ అతిథులుగా హాజరవుతారు. ఖాదర్ మొహియుద్దీన్ అధ్యక్షత వహిస్తారు.
ముస్లిం వాద తాత్త్వికత - సిద్ధాంతం - సాహిత్యం, ముస్లిం కవిత్వం, ముస్లిం కథ, ముస్లిం నవల, ముస్లిం సాహిత్య విమర్శలపై సదస్సులో చర్చలు జరుగుతాయి. చివరలో కవితా గోష్ఠి ఉంటుంది.