పూరీ తీరంలో బుధియా విగ్రహం
పూరి: ఏకధాటిగా 65 కిలోమీటర్ల దూరం పరుగు తీసి రికార్డు సృష్టించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించుకున్న ఒరిస్సా వండర్ మారథాన్ కిడ్ బుధియా సింగ్ మృణ్మయ విగ్రహం ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. 2006 అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా బుధియాను హీరోగా పరిగణిస్తూ సుదర్శన్ పట్నాయక్ అనే కళాకారుడు బుథియా మట్టి విగ్రహాన్ని రూపొందించారు. అతని విజయాన్ని గుర్తిస్తూ అతన్ని ప్రోత్సహించడానికి సుదర్శన్ పట్నాయక్ ఆ విగ్రహాన్ని పూరీలోని ఇసుక తీరం మీద నెలకొల్పారు.
పిల్లల్లో బుధియాను అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి బుధియా ఏడు అడుగుల విగ్రహాన్ని ఆయన సృజించారు. అక్కడ ఓ సందేశాన్ని కూడా ఉంచారు. పిల్లలతో ఆడుకోండి, రాజకీయాలు వద్దు అనేది ఆ సందేశం. ఆ కళాఖండాన్ని చూడడానికి పిల్లలు పెద్ద యెత్తున వస్తున్నారు. పిల్లలు సంతకాలు చేసి బుధియా దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ విగ్రహం ఫొటో కాపీని తాను రాష్ట్రపతి అబ్దుల్ కలామ్కు పంపుతానని పట్నాయక్ చెబుతున్నారు. ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి ఐదు గంటలు పట్టినట్లు ఆయన చెప్పారు. ఇందులో తనకు గోల్డెన్ స్యాండ్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు సహకరించినట్లు ఆయన తెలిపారు. పట్నాయక్ 28కి పైగా అంతర్జాతీయ మృణ్మయ విగ్రహాల ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నారు. పలు అవార్డులు కూడా పొందారు.