క్రికెట్: సీనియర్లకు పాఠం
ట్వంటీ 20లో అనుభవ రాహిత్యం, అనుభవం లేని యువ ఆటగాళ్లు ప్రపంచ కప్ ను గెలుచుకుని సొంత గడ్డపై కాలు పెట్టారు. వారికి లభించిన స్వాగతం కురిసిన కాసుల రాశుల కన్నా ఎన్నో రెట్లు మిన్నగా ఉందనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి భారత క్రికెట్ జట్టు ఆస్ట్లేలియాతో వన్డేల్లో తలపడనుంది. ట్వంటీ 20 విజయం భారత జట్టుకు మంచి కిక్కునిచ్చింది. అయితే ఆస్ట్రేలియాతో తలపడే జట్టులో భారత సీనియర్ త్రయం ఉంది. గాయాల పాలైతే తప్ప తప్పకుండా ఈ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు మైదానంలోకి దిగాల్సిందే. రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీలు ఉండే జట్టుకు కూడా ట్వంటీ 20 కప్ సాధించిన పెట్టిన మహేంద్ర సింగ్ ధోనీయే నాయకత్వం వహిస్తున్నాడు.
ధోనీ ట్వంటీ 20లో జట్టును సమష్టిగా ముందుకు నడిపించడం వల్లనే విజయాన్ని సాధించి పెట్టాడనడంలో సందేహం లేదు. వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భారత్ వెనుదిరగడానికి జట్టులోని అంతర్గత కలహాలు కూడా కారణమనేది వేరుగా చెప్పాల్సిన పని లేదు. ద్రావిడ్ కెప్టెన్సీ వదులుకోవడానికి కూడా ఈ విభేదాలు పని చేసి ఉంటాయి. కెప్టెన్సీ వదులుకోవడానికి ముందు ద్రావిడ్ ఓ సంచలత ప్రకటన చేసి తన ఇద్దరు సహచర ఆటగాళ్ల ఆగ్రహానికి గురయ్యాడు. తనతో పాటు సచిన్, గంగూలీ ట్వంటీ 20 ప్రపంచ కప్ పోటీలకు అందుబాటులో ఉండబోమనేది ఆ ప్రకటన. ఈ ప్రకటన టెండూల్కర్, గంగూలీలకు ఆగ్రహం తెప్పించిందనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. దాంతో ధోనీ నాయకత్వంలో యువ జట్టు ట్వంటీ 20 పోటీలకు వెళ్లాల్సి వచ్చింది. ఇతర జట్లలో మాత్రం సీనియర్ ఆటగాళ్లు దండిగానే ఉన్నారు. సీనియర్ ఆటగాళ్లున్న ఇంగ్లండు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లను ఓడించి భారత్ ఫైనల్లో కాలు పెట్టడం కాదు, దాయాదుల పోరులో పాకిస్థానును ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.
మనస్పర్థలకు, కుమ్ములాటలకు, వ్యక్తి ఇగోలకు పెద్దగా తావు లోని జట్టును విజయపథంలో నడిపించడంలో ధోనీ కృతకృత్యుడైనట్లే. అయితే యువరాజ్ గాయం కారణంగా ఒక మ్యాచుకు దూరం కావడంపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు కెప్టెన్సీ దక్కకపోవడంపై యువరాజ్ కినుకతో ఉన్నట్లు అతని తండ్రి చేసిన వ్యాఖ్యను బట్టి అర్థం చేసుకోవచ్చు. వీరేంద్ర సెహ్వాగ్ శకం ముగిసినట్లే కాబట్టి పెద్దగా రాజకీయాలు నడిపే పరిస్థితి అతనికి లేదు. ఇంగ్లండుపై విజయంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో పోరులోను అతను అద్భుతంగా ఆడాడు. ఫైనల్లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. యువరాజ్ జట్టులో లేనప్పుడు దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది. అతను పెద్దగా ఆడకపోయినా పాకిస్థానుపై ఫైనల్లో గెలుపును కైవసం చేసుకుంది. కెప్టెన్ ధోనీ బాగానే ఆడినప్పటికీ మిగతా ఆటగాళ్ల ప్రదర్శనే అంతకన్నా ఎక్కువ రాణింపునకు వచ్చింది. అందువల్ల ఏ ఒక్క ఆటగాడిపైనో జయాపజయాలు ఆధారపడి ఉండవని భారత జట్టు నిరూపించింది.
ఇర్ఫాన్ పఠాన్, హర్బజన్ సింగ్ లాంటి వాళ్లను మినహాయిస్తే మిగతా ఆటగాళ్లందరూ జట్టులో స్థిరంగా కొనసాగడానికి అవకాశాల ఎదురుచూస్తున్నవారే. దీంతో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఆర్పీ సింగ్ చూపిన బౌలింగ్ ప్రతిభ అతనిలోని శక్తిని వెలికి తీసింది. ఆర్పీ సింగ్ తమ బెదరగొట్టాడని పాకిస్థాన్ కెప్టెన్ మాలిక్ అనడం చూస్తే అతను ఎంతగా ప్రతిభను కనబరిచాడో అర్థం చేసుకోవచ్చు. కీలకమైన పరిస్థితుల్లో జోగీందర్ శర్మ, బ్యాటింగులో రోహిత్ శర్మ చూపిన ప్రతిభ మరుపురానివే.
ధోనీ క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కూల్ గా కనిపించాడు. ట్వంటీ 20 పోటీలకు వెళ్లినప్పుడు భారత జట్టుపై పెద్దగా అంచనాలు లేకపోవడం అతనికి అనుకూలించిన విషయంగానే చెప్పుకోవాలి. అయితే ఈ విజయం తర్వాత అతను ఎలా ఉంటాడనేది చూడాల్సే ఉంది. అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో జరిగే వన్డేలు అతనికి పరీక్షనే పట్టనున్నాయి. అంతేకాకుండా గంగూలీ, సచిన్, ద్రావిడ్ త్రయం పట్ల అతను ఎంత స్థిరంగా వ్యవహరిస్తాడనేది కూడా చూడాల్సే ఉంది. వారి వ్యక్తిగత బలిమి ముందు, వారి ప్రభావాల ముందు నిలబడి మనగలిగితే ఇక భారత క్రికెట్ కు ఢోకా లేదనే చెప్పవచ్చు. వారి వ్యక్తి ప్రాబల్యాలను అడ్డుకోవడం ధోనీకి ఇప్పుడు అవసరం. అస్ట్రేలియా జట్టులో మాథ్యూ హెడన్ వంటి సీనియర్లు, శ్రీలంక జట్టులోని సనత్ జయసూర్య వంటి సీనియర్లు ఎంతో హుందాగా ప్రవర్తించడం, వారి ప్రతిభను మొక్కవోకుండా ప్రదర్శించడం చూసైనా గంగూలీ, సచిన్, ద్రావిడ్ వంటి పెద్దలు పాఠాలు నేర్చుకుంటే భారత క్రికెట్ కు మేలు జరుగుతుంది.












Click it and Unblock the Notifications
