సరస్వతికి చదువొచ్చా?!
ఇది అర్థం లేని చర్య అని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కొట్టి పారేశారు. పరగోడును ఆపించేందుకు ప్రభుత్వ స్థాయిలో చేపట్టే చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. దీంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. పైగా కావేరీ జలాల వివాదంలో తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల స్థాయిలోనే పరిష్కార ప్రయత్నాలు జరిగాయని, కర్ణాటక ప్రభుత్వంతో వివాదాన్ని తేల్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అదే పద్ధతిలో వ్యవహరించడం సమంజసమని రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజానికి విషయం అదే.
చంద్రబాబు ఇప్పటి వరకు కర్ణాటక ప్రభుత్వాన్ని, ఇక్కడి కాంగ్రెస్వారిని దుయ్యబట్టే పనిలో నిమగ్నమయ్యారే తప్ప సమస్యను ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా పరిష్కరించానికి ప్రభుత్వ స్థాయిలో ఈ నెల 3వ తేదీ వరకు ఏ విధమైన చర్యలూ చేపట్టలేదు. పరగోడుపై ప్రధానికి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు కలిసి వచ్చేందుకు సిద్ధపడిన రాష్ట్ర బిజెపిని కూడా తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు పట్టించుకోలేదు. అంటే తెలుగుదేశం పార్టీకి సమస్య పరిష్కారం కన్నా దాన్ని రాజకీయ లబ్ధి ఎలా ఉంటుందనేదానిపైనే ధ్యాస ఎక్కువ ఉందనేది అర్థమవుతూనే ఉన్నది. పరగోడు ప్రాజెక్టుపై చంద్రబాబు ఈ నెల 3వ తేదీన యంత్రాంగాన్ని కదిలించారు. అంతకు ముందు సమాచార, పౌర సంబంధాల మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని సోమశిల వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతపురం తెలుగుదేశం నాయకులు చలో పరగోడు కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీన చేయతలపెట్టారు. అయితే ఈ యాత్రను కర్ణాటక సరిహద్దుల వరకే పరిమితం చేస్తూ ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఇవి ఒక రకంగా రాష్ట్ర ప్రజల మనోభావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగపడుతాయి. తాజాగా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అధికారులను ఢిల్లీకి పంపించారు. కర్ణాటక ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తున్న తీరుపై కేంద్రానికి, కేంద్ర జల సంఘానికి నివేదించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరగోడు ప్రాజెక్టును ఆపించడానికి తీసుకున్న నిర్దిష్ట చర్య ఇదొక్కటే.
ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల రాజకీయాలు నడుపుతోందని ఆయన ఈ నెల 3వ తేదీన విమర్శించారు. వంద గ్రామాలకు, గుదిబండ, బాగేపల్లి పట్టణాలకు మంచినీటి సౌకర్యం కల్పించేందుకే చిత్రావతి నదిపై పరగోడు ప్రాజెక్టును నిర్మిస్తున్నామని కృష్ణ వాదిస్తున్నారు. అయితే కృష్ణ వాదనలను ఇప్పటికే అనంతపురం జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖా మంత్రి నిమ్మల కిష్టప్ప ఖండించారు. సాగునీరు కూడా అందించే ప్రణాళిక ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నదని, అందుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం చెబుతున్న ప్రాంతాలకు మంచినీరు అందించడానికి 51 మిలియన్ క్యూబిక్ ఫీట్ జలం సరిపోతుందని, అయితే పరగోడు ప్రాజెక్టును 137.81 మిలియన్ క్యూబిక్ ఫీటు నీరు అందించేలా డిజైన్ చేశారని చంద్రబాబు అన్నారు. మొదటి నుంచి కర్ణాటక ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రాజెక్టులు నిర్మించుకుంటూ వస్తోందని కూడా ఆయన అన్నారు. పరగోడు ప్రాజెక్టు వల్ల కడప జిల్లాలోని 3.28 లక్షల మందికి మంచినీరు అందించే మూడు ఎత్తిపోతల పథకాలకు నీరందదని, అనంతపురం జిల్లాకు నీటి చుక్క కూడా రాదని ఆయన అంటున్నారు.
నిజానికి కర్ణాటకలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న దిగువ రాష్ట్రాల ప్రయోజనాలతో ప్రమేయం లేకుండా ప్రాజెక్టులు నిర్మించుకుంటూ పోతున్నారు. ఇది ఒక ఎస్.ఎం. కృష్ణకే వర్తించదు, మాజీ ప్రధాని దేవెగౌడకు కూడా వర్తిస్తుంది. నదీ జలాల వాడకానికి చేపట్టే నీటి పథకాల విషయంలో కర్ణాటక రాజకీయ నాయకులది ఒకే మాట. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఈ విషయంలో వెనకబడిపోయారు. దీనికి కారణం- ప్రజల ప్రయోజనాల కన్నా పార్టీ ప్రయోజనాలు ప్రధానం కావడమా? ఇంకేమైనా కారణం ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం.
కొసమెరుపు: ఆంధ్రప్రదేశ్కు చెందిన చాలా మంది రాజకీయ నాయకుల స్థిరాస్తులు బెంగుళూర్లో ఉన్నాయని ప్రచారం.