క్రికెటర్ల పనికిమాలిన పాట్లు
భారత క్రికెట్ ను ఎవరూ బాగు చేయలేరనే విషయం మరోసారి రుజువైంది. ట్వంటీ 20లో విజయ భేరీ మోగించిన భారత్ క్రికెటర్లు ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న వన్డే మ్యాచుల్లో ఘోరంగా విఫలమవుతున్నారు. సమస్య ఎక్కడుందో కూడా కనిపెట్టలేనంతగా భారత క్రికెట్ సంక్షోభంలో కూరుకుపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్కో సారి ఏ జట్టునైనా ఢీకొట్టగలదనే ఆట తీరును ప్రదర్శించే భారత క్రికెటర్లు ఏమీ చేతకాని వాళ్ల మాదిరిగా బేల మొహాలు వేయడం పరిపాటి అయింది.
కెప్టెనుగా ఎంపికైన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ తన బ్యాట్ తో కళ్లు మిరుమిట్లు గోల్పేట్లు చేసిన సందర్భాలు ఒకటి రెండు మినహా ఎక్కువ లేవు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆరో వన్డేలో రాబిన్ ఉతప్ప బ్యాటింగ్ విధానాన్ని చూసైనా అతను చలించినట్లు లేదు. రన్ రేటు ఎంతగా పడిపోవాలో అంతగా పడిపోయేలా చేసి వెనుదిరిగాడు. నిజానికి సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ ఆరో వన్డేలో మంచి ప్రారంభాన్ని అందించారు. గంగూలీ అవుటైన తర్వాత బ్యాటింగుకు దిగిన ఇర్పాన్ పఠాన్ తన పాత్రను తగిన విధంగానే పోషించాడు. ఆ తర్వాతనే ఓటమి దిశగా భారత్ నడిచింది. ఆ తర్వాత బ్యాటింగుకు దిగిన యువరాజ్, ద్రావిడ్, కెప్టెన్ ధోనీలు మ్యాచును గెలవాలనే ఉద్దేశంతో ఆడినట్లు ఏ కోశానా కనిపించలేదు. ఉతప్ప ప్రదర్శించిన నేర్పు, ప్రతిభ సీనియర్లకు దారి చూపలేకపోయింది.
నిలకడగా ఓ ఇద్దరో, ముగ్గురో బ్యాటింగ్ చేస్తారనే నమ్మకం భారత్ బ్యాటింగ్ లైనప్ లో లేకుండా పోయింది. ద్రావిడ్ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ఆడిన ప్రతి ఆటలోనూ బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. భారత ఆటగాళ్లలో సమష్టి తత్వం లోపించిందని స్పష్టంగానే తెలిసిపోతోంది. జట్టు కోసమో, దేశం కోసమో వారు ఆడినట్లు కనిపించడం లేదు. ఏదో విధంగా జట్టులో కొనసాగడం తప్ప అంతకు మించిన ప్రయోజనం వారు ఆశిస్తున్నట్లు లేదు. యువకులకు నాయకత్వం అప్పగిస్తేనో, యువకులను జట్టులోకి తీసుకుంటేనో, సీనియర్లకు స్వస్తి చెప్తేనో పరిస్థితి మెరుగు పడుతుందని చెప్పడానికి కూడా వీలు లేకుండా పోయింది. నాయకత్వ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ట్వంటీ 20 వేరు, వన్డే వేరు అని అస్ట్రేలియా కెప్టెను రికీ పాంటింగ్ సిరీస్ ఆదిలోనే స్పష్టంగా చెప్పాడు. భారత ఆటగాళ్లకు అది అర్థమైనట్లు లేదు.
విజిగీష ఉంటే తప్ప విజయాన్ని అందుకోవడం సాధ్యం కాదు. భారత ఆటగాళ్లలో లోపించింది అదేనని అనిపిస్తోంది. దానికి కారణాలు వ్యక్తిగతాలా, రాజకీయాలా, సీనియర్ల ఆధిపత్యమా అనేది ఇంకా తేలాల్సే ఉంది. భారత్ లో ప్రతిభ కొదవ లేదు. కానీ ప్రతిభతో పాటు నిజాయితీ గల ఆటగాళ్లతో జట్టును కూర్చడం సాధ్యమేతే తప్ప పరిస్థితి మారేట్లు లేదు.












Click it and Unblock the Notifications