సెప్టెంబర్ 17: ప్రాముఖ్యం
సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక ముఖ్యమైన రోజు. దేశానికంతా 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వస్తే తెలంగాణ ప్రజలు మాత్రం నిజాం నిరంకుశ పాలనపై పోరాటం చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవాలని నిజాం నవాబు ప్రయత్నాలు కూడా చేశారు. బ్రిటిష్ ప్రభుత్వంతో యథాతధ ఒప్పందాన్ని చేసుకున్న నిజాం నవాబు భారత యూనియన్ లో కలవడానికి మొరాయించారు. అయితే తెలంగాణలో రజాకార్ల దౌర్జన్యాలు పెచ్చు మీరి పోయాయి. అప్పటికే చాలా కాలంగా కమ్యూనిస్టులు, కాంగ్రెసు పార్టీవారు, ఆర్య సమాజ్ వివిధ రూపాల్లో రజాకార్లకు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నాయి. ఈ స్థితిలో పరిస్థితి నిజాం చేతుల్లోంచి జారిపోయింది. కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేస్తున్నారు. ప్రజలు తమకు అందుబాటులో ఉన్న ఆయుధాలతో పోరాటం చేస్తున్నారు. ఈ స్థితిలో నిజాం నవాబు భారత ప్రభుత్వం ముందు 1948 సెప్టెంబర్ 17వ తేదీన లొంగిపోయారు.
భారత ప్రభుత్వం తెలంగాణలోకి సైన్యాన్ని దించింది. నిజాం లొంగిపోయిన తర్వాత కూడా కమ్యూనిస్టులు తమ సాయుధ పోరాటాన్ని సాగించారు. దాదాపు నాలుగు వేల గ్రామాలను విముక్తం చేశారు. అయితే భారత సైన్యాలు కమ్యూనిస్టులపై దాడికి దిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటాన్ని విరమించింది. దాంతో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. దాదాపు మూడేళ్ల పాటు హైదరాబాద్ రాష్ట్రం కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన తెలుగు ప్రాంతాలతో కలిపి ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది. హైదరాబాద్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఈ విలీనం జరిగింది. ఫజల్ అలీ కమీషన్ సూచనలకు విరుద్ధంగా కూడా ఈ విలీనం జరిగింది.
నిజాం లొంగిపోయిన సెప్టెంబర్ 17వ తేదీని ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా గుర్తించి సంబరాలు జరపాలని బిజెపి డిమాండ్ చేస్తూ వస్తున్నది. అయితే, ఆంధ్ర ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి విముక్తమైన ఆగస్టు 15వ తేదీని, ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన నవంబర్ 1వ తేదీని అధికారికంగా గుర్తించి సంబరాలు చేస్తున్నది. కానీ సెప్టెంబర్ 17వ తేదీని గుర్తించడం లేదు. నిజానికి నవంబర్ 1వ తేదీ విలీనం హైదరాబాద్ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా జరిగింది. ఆగస్టు 15వతేదీన తెలంగాణకు స్వాతంత్ర్యం రాలేదు. అయితే సెప్టెంబర్ 17వ తేదీని మాత్రం గుర్తించడం లేదు. ఈ దృష్ట్యా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తినే పరిస్థితి వచ్చింది.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్ రాజ్యం నుంచి విడిపోయి కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కలిసి ప్రాంతాల్లో సెప్టెంబర్ 17వ తేదీని గుర్తించి ఉత్సవాలు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications