క్రికెటర్లపై యజమానుల పెత్తనం

రోజుకు ఒకటీ లేదా రెండు ఐపియల్ మ్యాచులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆట వల్ల క్రీడాకారులు తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి గురువుతున్నారనడంలో సందేహం లేదు. అయితే అవేం యజమానులకు పట్టవు. డబ్బులు కుమ్మరించాం కాబట్టి గెలుపును అందించాల్సిందేననేది యజమానుల అభిమతంగా ఉంటుంది. ద్రావిడ్ పై బెంగుళూర్ రాయల్ చాలెంజర్స్ యజమాని విజయ్ మాల్యా విరుచుకుపడిన వైనం అందుకు ఉదాహరణ. ఐపియల్ మ్యాచుల్లో రాయల్ చాలెంజర్స్ పరిస్థితి ఘోరంగానే ఉంది. ద్రావిడ్ కూడా రాణించలేకపోయాడు. తనలాంటి ఆటగాడు ట్వంటీ 20 మ్యాచులకు సరిపోడనే విషయం ద్రావిడ్ కు తెలియదని కాదు. కానీ డబ్బు కోసమే, కీర్తి కోసమో ఐకాన్ ప్లేయరుగా ఆయన ప్రవేశించాడు. టెస్టు జట్టుకు సరిపడే ఆటగాళ్లను ద్రావిడ్ ఎంపిక చేసుకున్నాడని విజయ్ మాల్యా ద్రావిడ్ పై రుసరుసలాడాడు. ఆ జట్టు కూర్పు ట్వంటీ 20 మ్యాచులకు సరిపడేలా లేదనేది వాస్తవమే. జట్టు ఎంపికలో తనను తప్పుదోవ పట్టించాడని చెప్పి సిఇవో చారుశర్మను విజయ మాల్యా తప్పించాడు. అయితే ఆట వేరు, జట్టు వేరు అని ద్రావిడ్ అంటున్నాడు. కానీ ఒకసారి కాకపోతే మరోసారి ఆటగాడు ఏదో ఒక మ్యాచులో సమర్థతను ప్రదర్శించాలనే విషయం ద్రావిడ్ కు తెలియంది కాదు.
ఇక, దక్కన్ చార్జర్స్ పరిస్థితి కూడా ఘోరంగానే ఉంది. గాయం కారణంగానే కెప్టెన్ వివియస్ లక్ష్మణ్ తప్పుకున్నాడని చెబుతున్నారు. కానీ అపజయాల పరంపర వల్ల అతను తప్పుకోవాల్సిన అనివార్యతలో పడ్డాడనేది వాస్తవం. దక్కన్ చార్జర్స్ లో మంచి ఆటగాళ్లు ఉన్నారు. గిల్ క్రిస్ట్, ఆండ్ర్యూ సైమండ్స్ వంటి మంచి విదేశీ ఆటగాళ్లతో పాటు రోహిత్ శర్మ, వేణుగోపాలరావు వంటి మంచి దేశీయ ఆటగాళ్లున్నారు. ఈ నలుగురు ఆటగాళ్లు బాగానే రాణించారు. అయితే, కెప్టెన్సీ లోపమో, మరోటో గానీ గెలవాల్సిన మ్యాచులను కూడా దక్కన్ చార్జర్స్ చేజార్చుకుంది. దీంతో లక్ష్మణ్ పక్కకు జరగక తప్పలేదు.
నిజానికి, లక్ష్మణ్, ద్రావిడ్ ఇద్దరూ మంచి బ్యాట్స్ మెన్. బ్యాటింగ్ కు రిథమ్ ను, స్టైల్ ను అందించిన ఆటగాళ్లు. బ్యాటింగ్ లోని మాధుర్యాన్ని అందించినవారు. వీరి బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుంది. కానీ వీరి ప్రతిభ ట్వంటీ 20 మ్యాచులకు సరిపోలేదు. సౌరవ్ గంగూలీ లాంటి దూకుడు ఆటగాడు కూడా వీటిలో వెనకబడిపోతున్నాడు. ఇక లక్ష్మణ్, ద్రావిడ్ ల సంగతి చెప్పేదేం ఉంటుంది. అందువల్ల తమ గౌరవం దక్కించుకోవాలంటే వీరు ఆటకు దూరంగా ఉండడమే మంచిదేమో. క్రికెట్ లో ఒక ప్రత్యేక స్థానం అందుకున్న ఆటగాళ్లు యజమానుల చేత విమర్శలకు గురికావడం బాధాకరంగానే ఉంటుంది.
ఇక, కోల్ కత్తా నైట్ రైడర్స్ యజమాని షారూఖ్ ఖాన్ మరో అడుగు ముందుకేశాడు. మ్యాచుల్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఆడని ఆటగాళ్లను ఇంటికి పంపించివేశాడు. కొనుక్కోవడం, వద్దనడం యజమానుల ఇష్టారాజ్యంగా మారిందనడానికే కాకుండా ఆటపై, ఆటగాళ్లపై పారిశ్రామికవేత్తల పెత్తనం మాత్రమే సాగుతుందనడానికి ఇదొక ఉదాహరణ. ఇటువంటి ఒత్తిడి వల్లనే బహుశా హర్భజన్, శ్రీశాంత్ ల వివాదం చోటు చేసుకుని ఉంటుంది. జట్టుకు నాయకత్వం వహించిన భజ్జీ తన జట్టు ఓటమి పాలవుతుంటే తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉంటాడు. అందుకే అతను ఆ విధంగా వ్యవహరించి ఉంటాడు. ఇటువంటి దుష్పరిణామాలు వచ్చే కాలంలో చోటు చేసుకునే పరిస్థితే ఉంది.












Click it and Unblock the Notifications
