వైయస్ పై కుట్ర ఉత్తదేనా?
వైయస్ హెలికాప్టర్ ప్రమాదాన్ని గుర్తించిన కో పైలట్ ఎంఎస్ రెడ్డి గో అరౌండ్ అంటూ అరిచిన మాటలు ఎటిసిలో రికార్డు అయ్యాయి. ట్రాన్స్ మిషన్ ఆయిల్ సమస్య తలెత్తిందని, ఆ సమయంలోనే ఆ సమస్యను పరిష్కరించడానికి పైలట్లు ప్రయత్నాలు చేశారు. దాన్ని పరిష్కరించలేకపోయారు. ఆ సమయంలోనే హెలికాప్టర్ నల్లమల అడవుల్లో మబ్బుల్లో చిక్కుకుంది. ఎదురుగా పెద్ద కొండ ఎదురైంది. కొండ నుంచి తప్పించడానికి హెలికాప్టర్ ను పైకి తీసికెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో హెలికాప్టర్ చెట్టును ఢీకొట్టి కుప్పకూలింది.
వాతావరణం బాగా లేకపోవడం, ట్రాన్స్ మిషన్ ఆయిల్ సమస్యను పరిష్కరించలేకపోవడం వల్లనే హెలికాప్టర్ ప్రమాదం సంభవించినట్లు సిబిఐ తేల్చింది. కుట్ర కోణాన్ని పరిశీలించడానికి సిబిఐ అధికారులు పోన్ కాల్స్ ను, ఎస్ఎంఎస్ లను పరిశీలించారు. బ్యాంక్ ఖాతాలను, ఇ - మెయిల్ బ్యాంక్ ఖాతాలను వారు పరిశీలించారు. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో ఏ విధమైన కాల్స్ గానీ ఎస్ఎంఎస్ లు గానీ రాలేదనీ వెళ్లలేదనీ తేల్చుకున్నారు. డబ్బులు పెద్ద యెత్తున చేతులు మారిన దాఖలు కూడా కనిపించలేదు. దీంతో కుట్ర కోణాన్ని సిబిఐ కొట్టేసింది.
వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ హైదరాబాదు నుంచి బయలుదేరి ప్రమాదానికి గురయ్యేంత వరకు ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే విషయాలను కూడా సిబిఐ సేకరించింది. మధ్యలో ఓసారి హెలికాప్టర్ జాడ శంషాబాద్ విమానాశ్రయానికి అందినట్లు కూడా తేల్చింది. చిత్తూరు జిల్లాలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు వాతావరణం అనుకూలించకపోయినా హెలికాప్టర్ లో బయలుదేరిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రమాదానికి గురై నిరుడు సెప్టెంబర్ 2వ తేదీన దుర్మరణం పాలయ్యారు.