ఖజానాకు లిక్కర్ కిక్
ఖజానాకు వెలుగులు నింపుతున్న ఆబ్కారీ శాఖ ఒక్క లైసెన్స్ రుసుముగానే రూ. 7000 కోట్లు జమ చేయబోతుంది. మద్యం దుకాణాల వేలం ప్రభుత్వానికి కనకవర్షం కురిపిస్తోంది. 2008-10 సంవత్సరానికి దుకాణాలను వేలం వేయడంతో లైసెన్స్ ఫీజుగా రూ.3182 కోట్లు జమయింది. 2010-11 సంవత్సరానికి దుకాణాల లైసెన్స్ ఫీజు రూ. 3680 కోట్ల మేరకు రాబట్టాలని అధికారులు అంచనా వేశారు. టెండర్లు తెరిచి దుకాణాల లైసెన్స్ ఖరారు చేసేనాటికి రూ. 6900 కోట్ల ఆదాయం రాగలదని అంచనా వేశారు. అయితే 7000 కోట్ల వరకు లైసెన్స్ ఫీజు రాబట్టే అవకాశం ఏర్పడిందని వివరించారు. ఆబ్కారీ అధికారులు గుర్తించిన దాదాపు 30 దుకాణాలు ప్రభుత్వ ఖజానాకు పెద్ద యెత్తున రాబడిని సమకూరుస్తున్నాయి.
2008-10 ఆబ్కారీ సంవత్సర కాలంలో మద్యం విక్రయాలు రూ. 12 వేల కోట్లకు చేరాయి. ఈ సంవత్సరం రెట్టింపు విక్రయాలు జరిగే అవకాశం ఉందని లిక్కర్ సిండికేట్ పసిగట్టింది. టెండర్ ఫారాలను విక్రయించడం ద్వారానే రూ. 48 కోట్లు ఆబ్కారీ శాఖ ఆర్జించింది. బినామీ పేర్లతో జారీ అయిన లైసెన్స్లే అధికం అని ఆబ్కారీ అధికారులు నిర్ధారించారు. తమకు కావలసింది ఆదాయం, ఎవరు దుకాణం పొందుతున్నారన్నది ముఖ్యం కానే కాదు, ఎంత వేలం పాడారు, ఎంత ఆదాయం రాబట్టగలం అన్నదే ముఖ్యమనే ఉద్దేశంతో ఆబ్కారీ శాఖ పనిచేయడం ప్రారంభించింది. వేలం పాటల్లో ఒక్కో దుకాణం కోట్లాది రూపాయలు పలికింది. గుంటూరు జిల్లాలోని ఓ దుకాణం నాలుగున్నర కోట్లకు పైగా పిలికి రికార్డు సృష్టించింది. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లోని దుకాణాలు కూడా కోట్లాది రూపాయలకు వేలం పాటలో పోయాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యా సంస్థల యజమానులు కూడా మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టారు. వచ్చే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏరులై పారే అవకాశం ఉంది. మంచినీళ్లు దొరకకున్నా మద్యం మాత్రం ఎల్లవేళలా, అన్ని చోట్లా అడిగిందే తడవుగా దొరికే ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధపడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.