పబ్ కల్చర్: అమ్మాయిలేం తీసిపోలేదు
కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు వారి తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీని వారు సక్రమంగా వినియోగించటం లేదు. హైటెక్ తల్లిదండ్రులు తమ పిల్లలను పట్టించుకోవడం మానేసి వారు అడిగినంత ఇస్తున్నారు. వారికి ఎంత అవసరం అన్న విషయాన్ని వారు ఒక్క క్షణం కూడా ఆలోచించటం లేదు. చాలామంది అడిగిన అమౌంట్ కన్నా ఎక్కువగానే ఇస్తున్నారు. పిల్లలమీద ప్రేమతో తాము అలా ఇస్తున్నామని అనుకుంటున్నారు. కాని వారు చెడిపోవటానికి తామే కారణమవుతున్నామని ఆలోచించటం లేదు. చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉన్న నేటి కాలంలో తల్లిదండ్రులు తమ బిజీ లైఫ్ లో పడి పిల్లలను పట్టించుకోవటం మానేశారు. తాతల కాలంలో తల్లిదండ్రులు పట్టించుకోకున్నా పెద్ద కుటుంబాలు కావటంతో తాతయ్య, నానమ్మ పిల్లలకు మంచి చెడులు చెప్పేవారు. పిల్లలు కూడా తాతయ్య, నానమ్మలతో గడపటానికి బయట కన్నా ఇంట్లోనే ఎక్కువ ఉండేవారు. కాని నేటి పిల్లలకు ఆ ఆదృష్టం లేక పోవటంతో స్నేహితులతో బయట తిరగడానికి అలవాటు పడుతున్నారు.
తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీతో ఇంతకుముందు కేవలం కాలేజికి ఎగ్గొట్టి సినిమాలు, షికార్లకు మాత్రమే వెళ్లేవారు. ఆ సంస్కృతి కాస్త దిగజారి నేటి విద్యార్థులు బార్ల వెంట పడుతున్నారు. అమ్మాయితో బైక్ పైన షికార్లు, బార్లలో మందు డాన్సర్లతో తాగి చిందులేయటం, కాఫీ క్లబ్బుల్లో గంటల కొద్ది కూర్చోవడానికే తమ జీవితంలో ఎక్కువ సమయాన్ని వృథా చేస్తున్నారు. మద్యం, సిగరేట్ అలవాటు లేనివాళ్లకు తోటివాళ్లతో అలవాటు అవుతున్నాయి. పబ్బులు, క్లబ్బులలో అమ్మాయిలూ కళాశాలలకు వెళ్లకుండా విచ్చలవిడిగా చిందేస్తున్నారు.
హైదరాబాద్, బెంగుళూరు, ముంబయి, చెన్నై, న్యూఢిల్లీ వంటి నగరాల్లో సగానికిపైగా 17 ఏళ్లలోపు అబ్బాయిలు, చాలామంది అమ్మాయిలు బార్లు, పబ్బుల వెంబడి తిరుగుతున్నారని ఓ సర్వేలో తేలింది. కాలేజ్ డే, ఫ్రేషర్స్ డే, లవర్స్ డే, న్యూఇయర్ సంబరాలంటూ చాలామంది పబ్బుల్లో గడుపుతున్నారని ఆ సర్వేలో తేలింది. ఇటీవలె హైదరాబాద్ లోని పలు పబ్బులపై పోలీసులు దాడి చేసారు. ఇందులో ఇద్దరు మైనర్లు దొరకడం తెలిసిందే. మైనర్లకు అనుమతిస్తే పబ్బులపై చర్యలు తీసుకుంటామని పోలీసులుహెచ్చరించటం గమనించదగ్గ విషయం. ఇక రెగ్యులర్ హాలీడేస్ లలోను స్పెషల్ క్లాసులు అంటూ చెప్పి అమ్మాయిలు, అబ్బాయిలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుంటారు. ఒక్కో విద్యార్థి ఒక సంవత్సరంలో బార్లకు, పబ్బులకు ఖర్చుపెట్టే అమౌంట్ కళాశాల ఫీజులో సుమారు సగం ఉంటుందంటే అశ్చర్య పోవడం మన వంతు.