చిరంజీవి కనిపించుట లేదు?
చిరంజీవికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రంలోని నేతలు సైతం చిరంజీవి రావడం రాష్ట్ర కాంగ్రెసుకు మంచి ఎసెట్ అన్నారు. అయితే వారి ఆశలన్నీ చిరంజీవి అడియాసలు చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఓ వైపు తెలంగాణ, మరోవైపు సీమాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న ఈ సమయంలో చిరంజీవి ఎక్కడా కనిపించ కుండా పోయాడు. కనీసం సమైక్యాంధ్ర కోసం, తెలంగాణ కోసం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న తన పార్టీ ప్రజాప్రతినిధులను సైతం ఆయన ఆపలేక పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితిని తొలగించేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ఓ వైపు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం వద్దకు వెళ్లి మాట్లాడాలని, రాజీనామాలు, బెదిరింపుల వల్ల సమస్య పరిష్కారం కాదని సూచిస్తున్నారు.
కానీ రాష్ట్ర కాంగ్రెసును కాపాడుతాడని నమ్మకం పెట్టుకున్న అధిష్టానాన్ని, రాష్ట్ర కాంగ్రెసు నేతల, కార్యకర్తల నమ్మకాన్ని మాత్రం చిరంజీవి నిలబెట్టలేక పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన బయటకు వస్తే సమస్య తీరుతుందా అనే వారు ఉండవచ్చు. కానీ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నానని అధికారికంగా ప్రకటించి, తనకు తాను కాంగ్రెసు నేతగా పేర్కొని, భావి ముఖ్యమంత్రిగా అభిమానులు, పలువురిచే భావింపబడుతున్న చిరంజీవి ఇరు ప్రాంతాల నేతలతో మాట్లాడి తన వంతు ప్రయత్నం ఎందుకు చేయడం లేదని పలువురి వాదన. రాష్ట్ర కాంగ్రెసును మారుస్తాడని భావించిన చిరంజీవి సమస్యలకు భయపడి బయటకు రావడం లేదని ఇలాంటి వారని భావి ముఖ్యమంత్రిగా ఎలా పేర్కొంటామని అనే వారూ ఉన్నారు. సమైక్యాంధ్రకు జై అన్న చిరంజీవి కనీసం సీమాంధ్ర నేతలకు సైతం సర్ది చెప్పక పోవడం పలువురిని విస్మయానికి గురి చేస్తోంది.