రేప్: భయం గుప్పిట్లో 'మెట్రో' అమ్మాయిలు!
ఢిల్లీ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతుండగానే బెంగళూరు, పాట్నాలలో నాలుగు రోజుల క్రితం మైనర్ బాలిక, మరో యువతి రేప్ బారిన పడ్డారు. బెంగళూర్లో ఓ దుకాణ యజమాని మైనర్ బాలికను మచ్చిక చేసుకొని దుకాణంలోకి లాక్కొని షట్టర్ వేసి రేప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాట్నాలోనూ గ్యాంగ్ రేప్ జరిగింది. ఇవి మరవక ముందే భర్తను వెతుక్కుంటూ నేపాల్ నుండి వచ్చిన ఓ యువతి మంబయిలో సామూహిక అత్యాచారానికి గురైంది.
మెట్రో నగరాల్లో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు అమ్మాయిలను, మహిళలను బయటకు వెళ్లాలంటేనే భయానికి గురి చేస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు తోడు లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి తలపిస్తోంది. ఢిల్లీ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన మెట్రో నగరాల కంటే ఢిల్లీలోనే ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయట. ఢిల్లీ దేశానికే కాదు... అత్యాచారాలకూ రాజధానిగా మారింది!
సగటున పదహారు గంటలకో అత్యాచారం ఢిల్లీలో జరుగుతోందట. 2010లో 414, 2011లో 568 అత్యాచారాలు జరిగాయట. 2012వ సంవత్సరంలో ఇంతకంటే ఎక్కువగానే నమోదయి ఉంటాయట. అయితే ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా లెక్క వేస్తే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది.
ఢిల్లీలో ప్రతి 761 మంది జనాభాకు ఒక పోలీసు భద్రత కల్పిస్తుంటే, ఒక్కో విఐపిని ముగ్గురు పోలీసులు కాపాడుతుండటం గమనార్హం. దేశంలో అత్యధికంగా అత్యాచారాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. తర్వాత పశ్చిమ బెంగాల్ (11,427), ఉత్తర ప్రదేశ్ (8834), అసోం (8060) రాష్ట్రాలు ఉన్నాయి. దాదాపు వెయ్యి వరకు రేప్ కేసులపై ఢిల్లీ కోర్టులలో విచారణ సాగుతోందట.