పేద విద్యార్థులకు ఆసరా ప్రారంభ్
పాఠశాల విద్యార్థుల కోసం నేషనల్ ఒలింపియాడ్ దేశవ్యాప్తంగా సెర్చ్ ఎగ్జామినేషన్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిభ గల విద్యార్థులను సెర్చ్ ఎగ్జామినేషన్స్ ద్వారా ఎంపిక చేసి భవిష్యత్తు చదువుల కోసం ఉపకారవేతనాల రూపంలో సహాయం అందిస్తోంది. పేదరికం వల్ల విద్యకు దూరమవుతున్న విద్యార్థుల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో సంస్థ ఉంది. ఇందుకు క్రై, స్మైల్ ఫౌండేషన్, టీచ్ ఫర్ ఇండియా, వేద్ వ్యాస్ ఫౌండేషన్ వంటి సంస్థలతో నేషనల్ ఒలింపియాడ్ కలిసి పని చేస్తోంది. పేద విద్యార్థుల సాధికారిత కోసం ఆ సంస్థలు పనిచేస్తున్నాయి.
ఐఐటి, ఐఐఎం, ఐఐఐటి, నిట్, ఎయిమ్స్ వంటివాటిలోకి ఎక్కువగా పట్టణ ప్రాంత విద్యార్థులే ప్రవేశిస్తున్నారు. ఇది కేవలం మంచి పాఠశాలల్లో చదవడం వల్లనే కాదు, చదువుకోవడానికి సరైన సదుపాయాలు ఉండడం వల్లనే. ప్రభుత్వ పాఠశాలల్లో, మురికివాడల్లో ఏర్పాటైన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆ అవకాశాలు కల్పిస్తే పేద విద్యార్థులు కూడా ప్రతిష్టాత్మకమైన కోర్సుల్లో ప్రవేశం పొందగలరనేది నేషనల్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఉద్దేశం.
విద్య ప్రారంభంలో చైతన్యం, మౌలికసదుపాయాలు, తెలివిడి, శిక్షణా సామగ్రి, మార్గదర్శకత్వం లోపించడం వల్ల ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ప్రవేశాలకు పేద విద్యార్థులు దూరమవుతున్నారు. ఈ విషయంలో మార్పు కోసమే నేషనల్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రారంభ్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు ప్రారంభ్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇందుకుగాను సెర్చ్ ఎగ్జామినేషన్ నిర్వహించి ప్రతిభ గల విద్యార్థులను వెలికి తీస్తారు. ఈ పిల్లలకు మంచి విద్యను బోధించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇస్తారు. ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆర్థిక వనరులు లేని విద్యార్థులకు ఉత్తమ విద్య అందుబాటులోకి వస్తుంది.
ప్రారంభ్ ప్రాజెక్టు ద్వారా 2012 -13 సంవత్సరంలో 25 వేల మందికి ప్రారంభ్ ద్వారా ఉత్తమ విద్యను అందుబాటులోకి తెస్తారు. సెర్చ్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రతిభ గల విద్యార్థులను ప్రాజెక్టు తుది స్థాయికి ఎంపిక చేసుకుంటారు. టాపర్స్కు ఉపకారవేతనాలు ఇస్తారు. వివిధ విద్యా సామగ్రిని అందిస్తారు. వివిధ రూపాల్లో విద్యార్థులకు సహాయం చేస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగిన పుస్తకాలను కూడా సమకూరుస్తారు.