క్షమాభిక్ష: మక్బుల్, మద్దెలచెర్వు సూరి ఎఫెక్ట్
హైదరాబాద్: ఉగ్రవాది మక్బూల్ ఉదంతం ప్రభుత్వాన్ని డైలమాలో పడేసింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హోం శాఖ ఆ విషయంలో పునరాలోచనలో పడినట్లు శనివారం వార్తలు వచ్చాయి. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్న మక్బూల్ వ్యవహారం వారికి ఇబ్బందికరంగా పరిణమించింది. హత్యకేసులో జీవిత ఖైదుపడ్డ మక్బూల్ 2009లో క్షమాభిక్షపై విడుదలై ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
అధికారులు సరిగా వ్యవహరించకపోవడంతోనే మక్బూల్ విడుదలై విధ్వంసానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. శిక్షా ఖైదీల ప్రవర్తనపై జైళ్ల శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగానే క్షమాభిక్షపై కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. అత్యంత నేరప్రవృత్తి కలిగిన మక్బూల్ను క్షమాభిక్షకు అర్హుడని అప్పట్లో జైళ్ల శాఖ ఎలా సిఫారసు చేసిందనేది వివాదంగా మారింది.
ఈ నేపథ్యంలో తాజా క్షమాభిక్ష జాబితాపై మరోసారి ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఖైదీల ప్రవర్తనపై లోతుగా పరిశీలించిన తర్వాతే క్షమాభిక్ష జాబితాలో వారి పేర్లను చేర్చనున్నట్లు తెలుస్తోంది. మక్బూల్ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ దిల్షుక్నగర్ పేలుళ్ల తర్వాత వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. మక్బూల్ క్షమాభిక్షను రద్దు చేశారు కూడా.

క్షమాభిక్షపై విడుదలైన మద్దెల చెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి బెదిరింపులు, సెటిల్మెంట్లకు పాల్పడుతూ అనుచరుడి చేతిలో హతమయ్యాడు. అంతకు ముందు కర్నూలు జిల్లాకు చెందిన గౌరువెంకట్ రెడ్డి కూడా హత్యకేసులో జీవితఖైదు అనుభవిస్తూ క్షమాభిక్షపై విడుదలయ్యాడు. వెంకట్రెడ్డి విడుదలపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి.
హత్యకేసుల్లో శిక్షపడి క్షమాభిక్షపై విడుదలైన వారు నేరాలకు పాల్పడి తిరిగి జైలుకు వస్తున్న సంఘటనలు ఎక్కువగానే ఉంటున్నాయి. మక్బూల్ విషయంలోనూ ఇదే జరిగినట్లుగా పేలుళ్ల కేసు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. క్షమాభిక్షపై విడుదలైన తర్వాత నెల్లూరు జైల్లో ఉన్న ఉగ్రవాదులను కలిసి దిల్సుఖ్నగర్ పేలుళ్లపై మక్బూల్ చర్చించినట్లు అధికారులు నిర్ధారించారు.












Click it and Unblock the Notifications