యూపీ సౌర విద్యుత్ హబ్ ‘అలహాబాద్’
అలహాబాద్ నగరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పాదక ‘హబ్’గా అవతరించింది. మేజా తహసీల్ పరిధిలోగల కోస్డా గ్రామంలో 250 ఎకరాల పరిధిలో విద్యుత్ పార్క్ పని ప్రారంభించేందుకు 80 శాతం పన
లక్నో: అలహాబాద్ నగరంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పాదక 'హబ్'గా అవతరించింది. గుజరాత్ రాష్ట్రంలో మాదిరిగా ఉత్తరప్రదేశ్లోని యమునా నదీ తీరాన గల అలహాబాద్ జిల్లాలోని మేజా తహసీల్ పరిధిలో సౌర విద్యుత్ పార్క్ స్థాపనకు రంగం సిద్ధమైంది. మేజా తహసీల్ పరిధిలోగల కోస్డా గ్రామంలో 250 ఎకరాల పరిధిలో విద్యుత్ పార్క్ పని ప్రారంభించేందుకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ముందుగా నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం వచ్చే ఆగస్టు నుంచి 50 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానున్నది.
అలహాబాద్ హైకోర్టు సహా పలు సంస్థలపై సౌర విద్యుత్ కేంద్రాలు
అలహాబాద్ నగర్ నిగం, అలహాబాద్ హైకోర్టు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటి - ఎ) అలహాబాద్ తోపాటు పలు ప్రభుత్వ రంగ కార్యాలయాలు, సంస్థల కార్యాలయ భవనాలపై సౌర విద్యుత్ ఉత్పాదక ప్లాంట్లు ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన మేరకు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపైన సౌర విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు పనిచేస్తున్నాయి. అలహాబాద్ నగరం నడిబొడ్డున వివిధ శాఖల కార్యాలయాలు కలిసి ఉన్న గల వికాస్ భవన్పై నెల రోజులుగా 70 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది.
ఐఐఐటిలో 300 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
ఇక నగరంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ - ఎ) ఆవరణలో 300 కిలోవాట్ల విద్యుత్ సామర్థ్యం గల ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం బాలుర హాస్టల్ భవనంపై సౌర విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ ఇన్స్టిట్యూట్పై ఏర్పాటు చేసిన 300 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను పవర్గ్రిడ్కు అనుసంధానం చేస్తారు. ఈ సంస్థకు చెందిన ఐదో హాస్టల్ భవనంపై పది ఇన్వర్టర్లు, సుమారు 940 సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. వచ్చే మే నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నారు.
పవర్ గ్రిడ్తో ఐఐఐటీ హాస్టల్ సౌర విద్యుత్ కేంద్రం అనుసంధానం
ఐఐఐటీ - ఎ హాస్టల్ భవనాలపై నిర్మించిన సౌర విద్యుత్ ప్లాంట్లలో అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్ను పవర్ గ్రిడ్తో అనుసంధానం చేస్తారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇటువంటి సౌర విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇదే పరిస్థితి యధావిధిగా కొనసాగితే అలహాబాద్ సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రధాన కేంద్రంగా అవతరించనున్నది. వేసవిలో విద్యుత్ కోతల నివారణకు సౌర విద్యుత్ ఉత్పత్తి సహకరిస్తుందని స్థానికులు చెప్తున్నారు.
నెడా ఆధ్వర్యంలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు
న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఎజెన్సీ (నెడా) జూనియర్ ఇంజినీర్ మహ్మద్ షాహీద్ మాట్లాడుతూ తమ సహకారంతో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు తోడు వ్యక్తులు కూడా వ్యక్తిగతంగా సౌర విద్యుత్ ప్లాంట్లు స్థాపించుకునేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పాదక కేంద్రాలతోపాటు అలహాబాద్లో ప్రగతిలో ఉన్న థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఇవి:
80 శాతం పూర్తయిన మెజా థర్మల్ విద్యుత్ ప్లాంట్
మెజా థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం 80 శాతం పూర్తి కావచ్చింది. ఇక జయ్ పీ గ్రూప్ ఆధ్వర్యంలో కార్ఛానా వద్ద మరో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. బారాలో విద్యుత్ ప్లాంట్ ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. 1980 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల మూడో యూనిట్ వచ్చేనెలలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నది. 1320 మెగావాట్ల విద్యుత్ ఉత్ప్తత్తి చేయగల సామర్థ్యం గల మూడో ప్రతిపాదిత విద్యుత్ ప్లాంట్లు అందుబాటులో ఉన్నాయి.
బారాలో పూర్తి కానున్న 1980 మెగావాట్ల సామర్థ్యం గల ఎన్టీపీసీ
బారాలో ఎన్టీపీసీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో 1980 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ నిర్మాణం పూర్తి కానున్నది. 660 మెగావాట్ల సామర్థ్యంగల మూడు యూనిట్లు వచ్చే మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. ఇదే తరహాలో కర్ఛానా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఇంకా పుంజుకోలేదు.
నిర్మాణంలో ఉన్న సౌర విద్యుత్ కేంద్రాలివి:
పోలీస్ లైన్స్లో 130 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం: నూతన సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు సర్వే పూర్తయింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం ప్రారంభం కానున్నది. అలహాబాద్ డివిజన్ కమిషనర్ కార్యాలయంలో 50 కిలోవాట్ల సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. మూడు నెలల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నది.