ఇక భవిష్యత్ విద్యుత్ వినియోగ వాహనాలదే

దాదాపు మూడు దశాబ్దాల క్రితం బొగ్గుతో నడిచే బస్సులు, రైలు ఇంజన్లు ఉండేవి. ఇప్పుడవి కనుమరుగు అయ్యాయి. అలాగే మరో ఎనిమిదేళ్ల తర్వాత డీజిల్‌, పెట్రోలుతో నడిచే వాహనాలు కనుమరుగవుతాయంటే నమ్మగలరా? ఎటుచూసినా వి

హైదరాబాద్: దాదాపు మూడు దశాబ్దాల క్రితం బొగ్గుతో నడిచే బస్సులు, రైలు ఇంజన్లు ఉండేవి. ఇప్పుడవి కనుమరుగు అయ్యాయి. అలాగే మరో ఎనిమిదేళ్ల తర్వాత డీజిల్‌, పెట్రోలుతో నడిచే వాహనాలు కనుమరుగవుతాయంటే నమ్మగలరా? ఎటుచూసినా విద్యుత్ వాహనాలే తప్ప డీజిల్‌, పెట్రోల్‌ వాహనాలు మచ్చుకైనా ఉండవంటే విశ్వసించగలరా? అదే జరగనున్నదంటున్నారు అమెరికాలోని స్టాన్‌ఫోర్ట్‌ విశ్వవిద్యాలయ ఆర్థికవేత్త టోనీ సెబా.

సమీప భవిష్యత్‌లో ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగం విప్లవాత్మక మార్పులకు లోనుకాన్నుదని, డీజిల్‌ - పెట్రోలు వాహనాల స్థానాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు ఆక్రమిస్తాయని ఆయన తేల్చి చెప్పారు. ఈ మార్పు ప్రజల జీవితాల మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద అనూహ్య మార్పు చూపుతుందని విశ్లేషిస్తున్నారు.

ఇందుకు సమగ్ర అధ్యయనం చేసి టోనీ సెబా ఒక నివేదికను రూపొందించారు. దీని ప్రకారం ఎనిమిదేళ్ల తరువాత వ్యక్తిగత వాహనాలైన కార్లు, ప్రజారవాణాకు వినియోగించే బస్సులు, సరకు రవాణా ట్రక్కులు... ఒకటేమిటి, అన్నీ కరెంటుతోనే నడుస్తాయి. దీర్ఘకాలం మన్నిక వీటి ప్రత్యేకత. పెట్రోలు/డీజిల్‌ కార్ల జీవితకాలం దాదాపు 3.21 లక్షల కిలోమీటర్లు అయితే, ఎలక్ట్రిక్‌ వాహనాలు 16.09 లక్షల కిలోమీటర్లు తిరగగలుగుతాయి.

ధర కూడా తక్కువే

విద్యుత్‌ ఇంధనంగా నడిచే వాహనాల ప్రవేశంతో రవాణా సేవల వ్యయం ఎంతో తగ్గిపోనున్నది. తద్వారా పెట్రోలు/ డీజిల్‌తో నడిచే ఇంటర్నల్‌ కంబస్టన్‌ (ఐసీ) ఇంజిన్‌తో తయారైన కార్లకు కాలం చెల్లిపోతుంది. ఆ స్థానాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీ) ఆక్రమిస్తాయి. స్వయంచోదక వాహనాలు రావడానికీ ఎంతో కాలం పట్టదు.రవాణా వ్యయాలు గణనీయంగా తగ్గిపోతే 2030 నాటికి అమెరికా ప్రజలకు లక్ష కోట్ల డాలర్ల మేరకు మిగులు కనిపిస్తుంది.

అమెరికాలో సగటున ఒక కుటుంబానికి 5,600 డాలర్ల మేరకు రవాణా సేవల ఖర్చులు మిగులుతాయి. అమెరికా రహదార్ల మీద వాహనాల సంఖ్య ఇప్పుడున్న 24.70 కోట్ల నుంచి 4.4 కోట్లకు తగ్గిపోతుంది. దీనివల్ల కొత్త వాహనాల తయారీ 70 శాతం క్షీణిస్తుంది. ఇది కార్ల తయారీ పరిశ్రమ, విడిభాగాల తయారీపై తీవ్రప్రభావం చూపుతుంది.

రెండు మూడేళ్లలోనే మార్పు!

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగించే బ్యాటరీల సామర్థ్యం వచ్చే రెండు మూడేళ్ల వ్యవధిలో 200 మైళ్లకు మించిపోతుందని అంచనా. అక్కడి నుంచి ఆటోమొబైల్‌ రంగంలో విప్లవం మొదలవుతుందని టోనీ సెబా ఈ నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక ఎలక్ట్రిక్‌ కార్ల ధర 30,000 డాలర్లకు తగ్గుతుందన్నారు. 2022 నాటికి ప్రారంభ శ్రేణి కార్లు 20,000 డాలర్ల నుంచి లభిస్తాయని, ఇక ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ వాహనాల విస్తరణకు అడ్డు ఉండదని వివరించారు. 2025 నాటికి వాహనాలన్నీ బ్యాటరీల మీదే నడిచే పరిస్థితి వస్తుందన్నారు.

చమురు దేశాల్లో రాజకీయ అనిశ్చితి

చమురుకు ఉన్న రాజకీయ, భౌగోళిక ప్రాధాన్యం క్షీణిస్తుంది. చమురు ఆదాయాలపై ఆధార పడి ఉన్న దేశాల్లో రాజకీయ అస్థిరత చోటుచేసుకునే అవకాశం ఉంది'' అని టోనీ సెబా రూపొందించిన నివేదిక అభిప్రాయపడింది. బ్యాటరీల తయారీలో వినియోగించే లిథియమ్‌ సరఫరాను కొన్ని దేశాలే నియంత్రించే అవకాశాలు తక్కువ. కాబట్టి ఇప్పుడున్న చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థల మాదిరిగా 'ఎలక్ట్రిక్‌ వాహనాల యుగం' లో కొన్ని దేశాలు ఆధిపత్యం చెలాయించే అవకాశాలు ఉండవు.

Better future for electric vehicles

చమురు రంగంలో సంక్షోభం

వాహన రంగంలో వచ్చే ఈ మార్పులు చమురు రంగంలో సంక్షోభానికి కారణమవుతాయి. 2020 నాటికి చమురుకు గిరాకీ రోజుకు 100 మిలియన్‌ బ్యారళ్లకు చేరుకున్నా.. తర్వాత క్రమంగా డిమాండ్‌ తగ్గిపోయి 2030 నాటికి 70 మిలియన్‌ బ్యారళ్లకు దిగొస్తుంది. దీంతో చమురురంగంలో గందరగోళం చోటుచేసుకుంటుంది. ఒక బ్యారెల్‌ చమురు ధర కూడా 25.4 డాలర్లకు పతనం అవుతుంది. అమెరికాలో షేల్‌ ఆయిల్‌, చమురు ప్రాసెసింగ్‌ సంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆయా సంస్థల్లో పనిచేసే ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోవాల్సివస్తుంది. చమురు ఉత్పత్తి అధికంగా ఉన్న దేశాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.

40కి పైగా సంస్థలు విద్యుత్ వాహనాల తయారీపై పరిశోధనలు

బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్‌ కారు అనగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్థ టెస్లా. అమెరికాకు చెందిన ఈ టెక్నాలజీ దిగ్గజం 2008లో టెస్లా రోడ్‌స్టెర్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ కారును ఆవిష్కరించి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయమైంది. ఈ దిశగా నలభైకి పైగా ప్రపంచ శ్రేణి సంస్థలు ఆటోమొబైల్‌ రంగంలో అధునాతన ఎలక్ట్రిక్‌ పరిజ్ఞానాన్ని ఆవిష్కరించటానికి పరిశోధనలు చేస్తున్నాయి.

ఆడి, ఫోర్డ్‌, హోండా, హ్యూండాయ్‌, స్కానియా, దైమ్లర్‌, వోల్వో, టయోటా, వోక్స్‌వ్యాగన్‌, జనరల్‌ మోటార్స్‌ తదితర ఆటోమొబైల్‌ కంపెనీలు, ఆపిల్‌, బోష్‌, డెల్ఫి, ఇవకో, ఇంటెల్‌, శ్యామ్‌సంగ్‌, హ్యూవావే వంటి టెక్నాలజీ సంస్థలు ఇందులో ఉన్నాయి. జనరల్‌ మోటార్స్‌ ఒక్కటే ఎలక్ట్రిక్‌ వాహనాలను ఆవిష్కరించటానికి 1100 కోట్ల డాలర్లు వెచ్చిస్తోంది. వాయు కాలుష్యం చైనాలో అత్యధికం. దీని నివారణకు చైనా కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తోంది. 2030 నాటికి ప్రధాన నగరాల్లో కనీసం 60 శాతం వాహనాలు బ్యాటరీతో నడిచేవే ఉండాలని చైనా భావిస్తోంది.

వివిధ దేశాల్లో ఇలా..

భారత్‌లోనూ 2032నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనాలే ఉండాలని కేంద్రం యోచిస్తోంది. పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంపొందించాలనే ఆలోచన మనదేశానికే కాదు, పలు సంపన్న, వర్ధమాన దేశాలు ఆలోచిస్తున్నాయి. జర్మనీలోని 16 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జర్మనీ ఫెడరల్‌ కౌన్సిల్‌ గత ఏడాది సమావేశమై.. 2030 నుంచి పెట్రోలు- డీజిల్‌తో నడిచే వాహనాలను నిషేధిస్తూ తీర్మానించింది.

ఆటోమొబైల్‌ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న జర్మనీలో ఇది విప్లవాత్మకమైన మార్పు అవుతుంది. అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలైన వోక్స్‌వ్యాగన్‌, ఆడి, స్కోడా తదితర కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల ఆవిష్కరణపై దృష్టి సారించాల్సి వస్తుంది. నెదర్లాండ్స్‌లో 10 శాతం వాహనాలు బ్యాటరీతో పనిచేసేవే. 2025 తర్వాత పెట్రోలు-డీజిల్‌ వాహనాలను అనుమతించరాదని నెదర్లాండ్స్‌ సెనేట్‌ తీర్మానించింది. 2025 తర్వాత ఎలక్ట్రిక్‌ వాహనాలు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకునేందుకు నార్వే సన్నద్ధం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+