సరదా ప్రయాణమే: మెట్రో రైలు చార్జీలు భరించలేం.. గిరాకీ తగ్గిన స్మార్ట్ కార్డులు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజారవాణా వ్యవస్థలో సరి కొత్తగా అరంగేట్రం చేసిన మెట్రో రైలు ప్రయాణంపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. మెట్రో రైలు ప్రారంభించిన కొత్తలో ఉన్న నగర వాసుల్లో ఉన్న ఊపు క్రమంగా తగ్గుతోంది. ఇతర రాష్ట్రాల్లోని మెట్రో రైలు చార్జీలతో పోలిస్తే హైదరాబాద్ మెట్రో రైలు చార్జీలు ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణం. స్టేషన్ల దగ్గర పార్కింగ్ సౌకర్యం లేకపోవడం మరో కారణం. ఎంఎంటీఎస్లో హైటెక్ సిటీ నుంచి మలక్ పేట వరకు కేవలం రూ.10 మాత్రమే టిక్కెట్ వసూలు చేస్తుండటం గమనార్హం.
Recommended Video

కానీ హైదరాబాద్ మెట్రోలో నాగోల్ నుంచి మియాపూర్ వరకు రూ.60 అంటే చాలా ఎక్కువేనన్న విమర్శ ఉంది. ఇక నెలవారీ పాసులు లేకపోవడమూ మూడో కారణమని చెప్పొచ్చు. దీంతోపాటు ఆర్టీసీ బస్సులు, ఓలా, ఉబర్ షేరింగ్ క్యాబ్లు సరసమైన చార్జీలతో ఉండటం నగరవాసులను ఆకర్షిస్తున్నాయి. ఇదీ కూడా మెట్రోరైలు ఆక్యుపెన్సీ తగ్గడానికి కారణమేనని ప్రజారవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం సెలవుల్లో లక్ష మంది ప్రయాణికుల రైడ్
మెట్రో రైలు ప్రారంభమైన తొలిరోజు 2.10లక్షల మంది ప్రయాణం చేయగా, ఆ తర్వాత క్రమంగా మెట్రో తగ్గుతూ వస్తోంది. సెలవు రోజుల్లో సుమారు లక్ష మంది ప్రయాణం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ సాధారణ రోజుల్లో మెట్రో రైళ్లలో ప్రయాణించే జనాలు గణనీయంగా తగ్గుతున్నారు. ప్రస్తుతం నాగోల్ నుంచి అమీర్పేట వరకు ప్రతి 15 నిమిషాలకు ఓ మెట్రో రైలును నడుపుతుండగా, అమీర్పేట నుంచి మియాపూర్కు 8 నిమిషాలకు ఒక రైలు నడుపుతున్నారు. ఒక్కో కోచ్లో సుమారు 300 మందికి అవకాశం ఉంది. ఇలా మూడు కోచ్లతో మెట్రో రైలు నడుస్తుంది. అంటే ఒక్కో రైలులో ఒకేసారి వెయ్యి మంది ప్రయాణించడానికి అవకాశం ఉంది.

అమీర్ పేట నుంచి మియాపూర్ మార్గంలోనూ ఇదే సీన్
మెట్రో రైలులోని కోచ్లో సుమారు 300 మంది ప్రయాణించడానికి అవకాశం ఉండగా, ఇరువైపులా 46 మంది కూర్చోవడానికి వీలు ఉంటుంది. రెండు రోజుల క్రితం ఉదయం ఆరు గంటలకు నాగోల్ నుంచి మెట్రో రైలు ప్రారంభమైన సందర్భంలో ఉప్పల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ, మెట్టుగూడ స్టేషన్లో జనాల్లేరు. ఉదయం వేళలో అమీర్పేట వైపు వెళ్లే మెట్రో రైళ్లలో ఒక కోచ్లో 60 మంది లోపే ఉంటున్నారు. అమీర్పేట నుంచి నాగోల్ వైపు వచ్చే రైళ్లలోనూ అంతగా జనాలు ఉండడం లేదు. ఉదయం 8.30గంటల సమయంలో సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్కు చేరుకున్న అమీర్పేట వైపు వెళ్లే మెట్రో రైలులో కోచ్లో 56మందే ఉన్నారు. అదే నాగోల్ వైపు 8.45 గంటలకు వెళ్లే రైలులో కోచ్లో 33 మందే ఉన్నారు. ఉదయం 10.30గంటల వరకు ప్రయాణికుల సంఖ్య ఇలాగే ఉంది. అమీర్పేట నుంచి మియాపూర్ వైపు కూడా అదే పరిస్థితి.

నాగోలు వెళ్లే రూట్లలోనే ప్రయాణికులు ఎక్కువ
మధ్యాహ్నం వేళలో మెట్రో రైళ్లలోనూ, మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు కనిపించడం లేదు. సాయంత్రం వేళలో ఉదయం కంటే కొంత అధికంగా ప్రయాణిస్తున్నారు. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అమీర్పేట వైపు వెళ్లే రైళ్లలో కంటే నాగోల్ వైపు వెళ్లే రైళ్లలో నే అధికంగా జనాలు ఉన్నారు. అమీర్పేట నుంచి బయలు దేరిన మెట్రో రైలులో సికింద్రాబాద్ ఈస్ట్ స్టేషన్లో సుమారు 70 నుంచి 90 మంది వరకు దిగుతున్నారు. ఇక్కడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండటంతో ప్రయాణికులు అధికంగా దిగుతున్నారు. కానీ ఈ స్టేషన్లో ఎక్కేవారి సంఖ్య ప్రతి పదిహేను నిమిషాలకు ఇరు ప్లాట్పామ్లపై పది నుంచి 15 మంది మాత్రమే ఉంటున్నారు. అమీర్పేట నుంచి నాగోల్ మార్గంలో కోచ్కు 80మందిలోపు ప్రయాణిస్తుండగా, హబ్సిగూడ, ఉప్పల్ చేరే సరికి దాదాపు మెట్రో రైలు ఖాళీ అవుతోంది.

స్మార్ట్ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గుదల
తార్నాక స్టేషన్లో బుధవారం సాయంత్రం 7.24 గంటలకు అమీర్పేట వైపు వెళ్లే ప్లాట్ ప్లామ్పై 14మంది ప్రయాణికులు ఉండగా ఇందులో ముగ్గురు మాత్రమే ప్రతి రోజూ ప్రయాణిస్తున్నామని చెప్పారు. ఇద్దరు అప్పుడప్పుడని, మిగతా తొమ్మిది మంది కొత్తగా ఎక్కడానికి వచ్చామని చెప్పారు. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్లో రాత్రి 8గంటలకు అమీర్పేట వైపు నుంచి వచ్చిన మెట్రో రైలు నుంచి దిగిన 72మందిలో స్మార్ట్కార్డు ఉపయోగించినవారు 17మంది మాత్రమే ఉన్నారు. మెట్రో ప్రారంభంలో మెట్రో స్మార్ట్ కార్డు ధర రూ.200 ఉండటంతో జనం కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో రూ.150కు తగ్గించారు. ఇప్పటి వరకు 1.50లక్షల వరకు స్మార్ట్కార్డులు కొనుగోలు చేసిన్నట్టు అధికారులు చెబుతున్నా రోజువారీగా వినియోగించే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

మెట్రో ప్రయాణంలో జాప్యం సమస్యే
హైదరాబాద్ నగర వాసులకు చార్జీలు భారంగా మారడంతో మెట్రో రైలులో ప్రయాణిచేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో పాటు నాగోల్ నుంచి మియాపూర్కు ప్రయాణానికి గంట కు పైగా సమయం పడుతోంది. ట్రాఫిక్ను మినహాయిస్తే ఓలా, ఊబర్ కార్లతో పాటు ద్విచక్ర వాహనాలపైనా గంటలోపే చేరుకోవడానికి అవకాశం ఉంది. పలు మెట్రో స్టేషన్ల దగ్గర మెట్రో రైలు 20 సెకన్లు ఆగాల్సి ఉండగా రెండు నిమిషాల వరకు ఆగడంతో పాటు కొన్నిసార్లు 15 నిమిషాలకు పైగా నిలుపుతున్నారు. నాగోల్ నుంచి మియాపూర్ వెళ్లేందుకు అమీర్పేట ఇంటర్ఛేంజ్ స్టేషన్లలో రైలు మారే క్రమంలో 15 నిమిషాలకు పైగా సమయం పడుతోంది.

అత్యవసర వేళల్లోనే మెట్రోను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు
పలు స్టేషన్ల దగ్గర పార్కింగ్ సౌకర్యం కూడా స్టేషన్లకు కార్లలో వచ్చేవారంతా వెనుదిరుగుతు న్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన స్టేషన్ల దగ్గర కారు పార్కింగ్ సౌకర్యం ఉన్నా మెట్రో ఎక్కడానికి ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం 24 మెట్రో స్టేషన్లు అందుబాటులోకి రాగా, ఇందులో ఎన్జీఆర్ఐ, ఉప్పల్ స్టేడియం, మెట్టుగూడ, ప్రకాశ్నగర్ తదితర స్టేషన్ల దగ్గర సాధారణ రోజుల్లో రోజుకు 200టోకెన్లు కూడా అమ్ముడుపోవడం లేదని తెలిసింది.
‘ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు అత్యవసరమైనప్పుడే మెట్రో రైలులో పనిమీద వెళ్తుంటా. ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. కొన్ని స్టేషన్లలో ఎక్కు వసేపు ఆపుతున్నారు. చార్జీలు మరీ ఎక్కువగా ఉండటంతోనే ప్రజలు వస్తలేరు' అని సీతాఫల్ మండి వాసి ఎన్ అరుణ్ చెప్పారు. ఉప్పల్ వాసి బీ శివరాజ్ అనే వ్యక్తి స్పందిస్తూ ‘చార్జీలు మరీ ఎక్కువగా ఉన్నాయి. అర్జెంట్ పని మీద అమీర్పేటకు పోయి రావాలి. అప్ అండ్ డౌన్ టోకెన్ లేదంటా..! ముంబై మెట్రోరైలులో అప్ అండ్ డౌన్ టోకెన్ ఉండటంతోపాటు చార్జీలు తక్కువగా ఉంటాయి. అమీర్ పేటకు పోయొస్తే రూ.80లా' అని నిరాశ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications