'మళ్లీ ఆ యూనివర్సిటీయే టాప్' : ఇండియన్ వర్సిటీలకు క్యూఎస్ ర్యాంకులు
న్యూఢిల్లీ : విశ్వవిద్యాలయాలు పటిష్టంగా ఉంటేనే శాస్త్ర-సాంకేతిక రంగాల్లో దేశం అభివృద్ది వైపు పరుగులు పెడుతుంది. అందుకే ఏ దేశాభివృద్దికైనా విశ్వవిద్యాలయాలు పట్టుకొమ్మల్లాంటివి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్సిటీలతో మన వర్సిటీలు పోటీ పడగలిగినప్పుడే అధునాతన ఆవిష్కరణలు సాధ్యపడుతాయి. మరి ప్రపంచ వర్సిటీలతో పోలిస్తే మన వర్సిటీల పనితీరు ఏవిధంగా ఉందో తెలుసా..?
వర్సిటీల విషయంలో.. 'ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు (IISc-B)ఇండియాలోనే టాప్ గా నిలిచింది. బ్రిక్స్ దేశాల్లోని వర్సిటీలకు ర్యాంకులు ప్రకటించే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. బ్రిక్స్ దేశాలైనా బ్రెజిల్, చైనా, ఇండియా, రష్యా, దక్షిణాఫ్రికా దేశాలకు ప్రతీ ఏటా ర్యాంకులు ప్రకటిస్తూ వస్తోంది క్యూసో వరల్డ్ యూనివర్సిటీ.
అందులో భాగంగానే ఈ ఏడాది ప్రకటించిన మొత్తం 250 ర్యాంకుల్లో.. 44 ఇండియన్ వర్సిటీలకు ర్యాంకులు దక్కాయి. ఇందులో ఇండియా నుంచి టాప్ లో నిలిచిన 'ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు', మొత్తం ర్యాంకుల జాబితాలో టాప్-6 స్థానంలో నిలిచింది. అయితే గతేడాది పోల్చితే బెంగుళూరు ఇనిస్టిట్యూట్ ఈ ఏడాది ఒక ర్యాంకు కిందకు దిగడం గమనార్హం.
ఇక గతేడాది టాప్-10లో చోటు సంపాదించుకున్న ఆరు ఇండియన్ వర్సిటీలు తిరిగి ఆ స్థానాలను నిలబెట్టుకోలేకపోయాయి. దీంతో క్యూఎస్ ప్రకటించిన ర్యాంకుల్లో కేవలం 8 ఇండియన్ వర్సిటీలు మాత్రమే టాప్-50 లో చోటు సంపాదించుకున్నాయి. గతేడాది క్యూఎస్ 200 ర్యాంకులను ప్రకటించగా.. అందులో 31 ఇండియన్ వర్సిటీలకు చోటు దక్కితే.. ఈ ఏడాది 250 ర్యాంకులను ప్రకటించడంతో 44 వర్సిటీలకు చోటు దక్కింది.
అయితే ఇండియా కంటే ముందు 86 వర్సిటీలకు ర్యాంకులకు దక్కించుకున్న చైనా, రష్యా-55 వర్సిటీలు, బ్రెజిల్-54 వర్సిటీలు ముందు వరుసలో ఉన్నాయి. ఇక తాజా ర్యాంకులపై స్పందించిన హెడ్ ఆఫ్ రీసెర్చ్ బెన్ సౌటెర్.. క్యూఎస్ ర్యాంకులను పెంచడం ద్వారా ఇండియా పరిశోధనల్లో మరింత రాటుదేలుతుందని, ర్యాంకులు సాధించిన 44 ఇండియన్ వర్సిటీల్లో, 12 ఇండియన్ వర్సిటీల పరిశోధనలు చైనా, రష్యా, బ్రెజిల్ లతో పోటీ పడే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.