దేశంలో పచ్చదనం: ఎపి అగ్రస్థానం, తెలంగాణ ఐదో స్థానం
న్యూఢిల్లీ: దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుతోంది. ఆ విస్తీర్ణం ఒక శాతం పెరిగినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. గత రెండేళ్లలో అటవీ విస్తీర్ణం 6,778 చదరపు కిలోమీటర్లు పెరిగింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఒడిశా ముందంజలో ఉన్నాయి. కాగా, ఆరు ఈశాన్య రాష్ట్రాల్లో అది తగ్గుతుండడం ఆందోళనకరమైన విషయం. తూర్పు హిమాలయ ప్రాంతంలో 630 చదరపు కిలోమీటర్లు తగ్గింది.

అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్
పచ్చదనాన్ని పెంపొందించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు - 2017 పేరిట కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ పరిధిలోని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఐ) నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

ఆ నివేదిక ప్రకారం ఇలా...
కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం ఆ నివేదికను వెల్లడించారరు. 2015 - 2017 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,141 చదరవు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం పెరిగింది.

తెలంగాణలో ఇలా పెరిగింది...
అటవీ విస్తీర్ణం కర్ణాటకలో 1,101 చదరపు కిలోమీటర్లు, కేరళలో 1,043 చదరపు కిలోమీటర్లు, ఒడిశాలో 885 చదరపు కిలోమీటర్లు, తెలంగాణలో 565 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాలను వరుసగా ఈ రాష్ట్రాలు పొందాయి.

వనం మనం కార్యక్రమమేనా...
అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం పొందడానికి వనం - మనం కార్యక్రమమే కారణమని అంటున్నారు. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించింది.












Click it and Unblock the Notifications