హైదరాబాద్ మెట్రో రైలు: సీటు దొరికితే అదృష్టమే! ప్రతి రైలుకు మూడే కార్లు, ఇవీ విశేషాలు..
భాగ్యనగర వాసులను ఎన్నాళ్ల నుంచో ఊరిస్తోన్న మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడింది. నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మియాపూర్ లో మెట్రో రైలును ప్రారంభించనున్నారు.
Recommended Video
హైదరాబాద్: భాగ్యనగర వాసులను ఎన్నాళ్ల నుంచో ఊరిస్తోన్న మెట్రో రైలు ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడింది. నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మియాపూర్ లో మెట్రో రైలును ప్రారంభించనున్నారు. మెట్రో కారిడార్ కు మియాపూర్ కేంద్రంగా మారనుంది. సర్వహంగులు దిద్దుకుంటున్న మెట్రో కారిడార్ తో మియాపూర్ రూపురేఖలు మారనున్నాయి.
ప్రారంభం దగ్గర పడడంతో మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయి. మెట్రో కారిడార్ అంతటా గ్రీనరీ, పార్కింగ్, సైకిల్ రైడింగ్, ఫుట్ పాత్ లు, చిన్నారుల కోసం ఆటస్థలాలు, రోడ్డు దాటేందుకు అవసరమైన మార్గాలు.. ఇలాంటి పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మెట్రో రైలు భద్రతకు సంబంధించి ఆయా శాఖల అధికారులు పలుమార్లు సమావేశమయ్యారు.
స్టేషన్ కు వెళ్లడం సులువే...
ఎయిర్ పోర్టుకు వెళ్లాలంటే కష్టం కానీ మెట్రో రైలు స్టేషన్లకు వెళ్లడం మాత్రం ఎంతో సులభం. ఇందుకు తగ్గట్లుగా అవసరమైన బస్సు సౌకర్యం కల్పించనున్నారు మెట్రో అధికారులు. మియాపూర్, చందానగర్, లింగంపల్లి చుట్టుపక్కల కాలనీల నుంచి మెట్రో స్టేషన్లకు ఎల్అండ్టీ మెట్రోకు చెందిన మెరిగో రౌండర్ (మినీ) బస్సులను నడపనున్నారు. ఒక్కో బస్సులో 24 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇంటి ముందుకే బస్సు వెళ్లి ప్రయాణికులను మెట్రోస్టేషన్కు చేరవేసే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీటు దొరికితే అదృష్టమే...
బస్సు ఎక్కగానే సీటు కోసం చూసే నగరవాసులకు.. మెట్రోలోనూ సీటు కోసం శ్రమించక తప్పదు. మెట్రో రైలులో సీటు దొరికితే అదృష్టమే. అసలు మెట్రో ఉద్దేశం.. స్వల్ప దూరాల ప్రయాణాల కోసమే కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఎక్కువ మంది సౌకర్యంగా నిలబడి ప్రయాణించేలా మెట్రో రైలు కార్లను రూపకల్పన చేశారు. ప్రపంచంలోని మెట్రో రైళ్లన్నింటి కంటే అత్యాధునికమైంది హైదరాబాద్ మెట్రో. ఇప్పటికే 57 మెట్రో రైళ్లు నగరానికి చేరుకున్నాయి. ఒక్కో మెట్రో రైలులో మూడు కార్లు(కోచ్ లు) ఉంటాయి. తొలి విడతలో నడిచే మెట్రోరైళ్లు ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.
3 నుంచి 5 నిమిషాలకో రైలు...
హైదరాబాద్ మెట్రో రైలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాలకో రైలు ఉంటుంది. టిక్కెట్ ధర రూ.9 నుంచి 20 వరకు ఉంటుంది. గంటకు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కిలోమీటరుకు ఒక స్టేషన్ ఉన్నందు వల్ల సగటున గంటకు 33 కిలోమీటర్ల వేగంతో మాత్రమే మెట్రో రైలు ప్రయాణిస్తుంది. ఒక్కో స్టేషన్లో 20 సెకన్లు, టర్మినల్ స్టేషన్లలో 30 సెకన్లపాటు ఆగుతుంది. ప్రతి మెట్రో రైలుకు డ్రైవర్ తోపాటు మరొక్క ఉద్యోగి మాత్రమే ఉంటారు. ప్రయాణికుల అవసరాల కోసం మెట్రో స్టేషన్లలో మొదటి అంతస్తును షాపింగ్ జోన్ గా తీర్చిదిద్దారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే మాల్స్, స్టాల్స్ లో ప్రయాణికులు షాపింగ్ చేయొచ్చు. రెండో అంతస్తు మాత్రం పెయిడ్ జోన్ గా ప్రకటించారు. ఈ అంతస్తులో రైలు ఎక్కి దిగడం మాత్రమే ఉంటుంది.
ప్రతి రైలుకు మూడే కార్లు...
ప్రతి మెట్రోరైలులో మూడు కార్లు(కోచ్ లు) మాత్రమే ఉంటాయి. ముందు, వెనక మోటార్ డ్రైవింగ్ కార్లుంటాయి. ఇందులో ఇంజిన్లుంటాయి. ఇంజిన్ అనగానే ఎంతో స్థలం ఆక్రమిస్తుందనుకుంటే పొరపాటే. చాలా తక్కువ స్థలంలో కేవలం ఇద్దరు పట్టేంత వెడల్పు మాత్రమే ఉంటుంది. మధ్యలో ట్రైలర్ కారు ఉంటుంది. చూడటానికి మూడు దాదాపుగా ఒకేలా ఉంటాయి. ఢిల్లీలో నడిచే మెట్రో రైలు ఆరు కార్ల మెట్రో. అక్కడ ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి అక్కడి రైళ్లకు ఆరు కార్లు తగిలించి నడుపుతున్నారు. హైదరాబాద్ మెట్రోలో కూడా.. ప్రయాణీకుల రద్దీని బట్టి అవసరమైతే ఇప్పుడున్న మూడు కార్లకు అదనంగా మరో మూడు ట్రైలర్ కార్లను జోడించుకోవచ్చు.
ఒక్కో మెట్రో రైలులో గరిష్ఠంగా 974 మంది...
ప్రతి మెట్రో రైలులో 126 మంది కూర్చుని, 848 మంది నిలబడి ప్రయాణించవచ్చు. మొత్తం మూడు కార్లలో ఒకేసారి గరిష్ఠంగా 974 మంది ప్రయాణించే వీలుంది. సీట్లు తక్కువగా, నిల్చోడానికి సౌకర్యంగా ఉండేలా కారు లోపల విశాలంగా డిజైన్ చేశారు. ఒకే చోట ఎక్కువ బరువు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి చదరపు మీటరు వైశాల్యంలో 8 మంది ప్రయాణికులు నిల్చునేలా గరిష్ఠంగా 17 టన్నుల బరువు మోసేలా రూపొందించారు. ముందు వెనక కార్లలో ఒక్కోదాంట్లో 40 మంది కూర్చునేలా, 275 మంది నిల్చునేలా ఏర్పాటు చేశారు. మధ్య కారులో సీటింగ్ సామర్థ్యం ఎక్కువ. ఇక్కడ 46 మంది కూర్చుని, 298 మంది నిల్చుని ప్రయాణించవచ్చు. వికలాంగులకు ప్రత్యేక సీట్లు, వీల్ చైర్లాంటి సదుపాయాలన్నాయి.
ఏసీ కోచ్ లలో హాయి హాయిగా...
మెట్రో రైలులో ప్రయాణం భలే సౌకర్యంగా ఉంటుంది. కోచ్లో ఏసీ ఉండడం వల్ల రద్దీలోనూ ఉక్కపోత ఉండదు. డోర్పైన ఎల్సీడీల్లో తరువాతి స్టేషన్ల సమాచారం ప్రదర్శితమవుతూ ఎప్పటికప్పుడు ప్రయాణికులకు అప్రమత్తం చేస్తుంది. కోచ్లలో అక్కడక్కడ ఏర్పాటు చేసిన ఎల్సీడీలల్లో సమాచారంతోపాటు వినోదం చూడొచ్చు. ఇంకా, మొబైల్, ల్యాప్ట్యాప్ ఛార్జింగ్ పాయింట్లు కూడా మెట్రో కార్లలో ఉంటాయి. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు ఏర్పడినా గంటపాటు పనిచేసే బ్యాటరీ బ్యాకప్ ఉంది.