ఆ రెండు గంటలు: అల్లాడుతున్న విద్యార్థులు, ఉద్యోగులు.. ప్రత్యక్ష నరకం?
నగరంలో మొత్తం 3,500 ఆర్టీసీ బస్సులుండగా.. వీటిలో 900 బస్సులను విద్యార్థుల కోసం నడుపుతున్నట్టుగా ఆర్టీసీ చెబుతోంది.
హైదరాబాద్: పొద్దున్నే లేచి.. టిప్ టాప్గా రెడీ అయి.. స్కూలుకో, ఆఫీసుకో సిటీ బస్సులో బయలుదేరామే అనుకో.. గమ్య స్థానంలో దిగేసరికి.. ప్రాణం కాస్త ఉసూరుమన్న ఫీలింగ్ కలగకమానదు.
కిక్కిరిసిపోయే రోడ్లు, దానికి తోడు పరిమితికి మించి బస్సులో ప్రయాణికుల తాకిడి.. రెండు కాళ్లపై సరిగ్గా నిలుచుకోవడానికి కూడా ప్లేస్ లేని బస్సులో.. గాలి కూడా ఆడని స్థితిలో.. ప్రయాణమంతా ఎత్తేసి కుదేసినట్టే అనిపిస్తుంది. దిగాల్సిన స్టాప్ లో దిగేసరికి.. చెదిరిపోయిన జుట్టు.. ఊడిపోయిన టక్కు.. తొక్కి తొక్కి నలిగిపోయిన పాదాలు.. ఒళ్లంతా హూనమైన ఫీలింగ్.
ఒకరకంగా పొద్దున పూట, సాయంత్రం పూట సిటీ బస్సుల్లో ప్రయాణం అంటే నరకాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు.
కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ
ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవాళ్లు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవాళ్లు.. చాలామంది ఆర్టీసీ బస్సుల ద్వారానే ప్రయాణాలు సాగిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 3,50,000మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ఎక్కువమంది ఆర్టీసీ పాసులపై ఆధారపడి ఉన్నవారే. ఇక ఉద్యోగుల సంఖ్య ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయాణికుల జనాభాకు, నడుపుతున్న బస్సులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో.. ఆర్టీసీ బస్సులు కిక్కిరిపోతున్నాయి.
ఆ రెండు గంటలు:
ఉదయం 8గం.-10గం. మధ్యలో బస్సులన్ని కిక్కిరిసిపోయి ఉంటుండంతో.. చాలామంది విద్యార్థులు ఫుట్ బోర్డుల వద్ద వేలాడుతూ కనిపిస్తున్న పరిస్థితి. కేవలం ఒక్క కాలుతో బ్యాలెన్స్ చేసుకుంటూ.. పదుల కొద్ది విద్యార్థులు ఫుట్ బోర్డు వద్ద వేలాడుతూ కనిపిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతీ రోజూ కొంతమంది గాయపడుతూనే ఉన్నారు. విద్యార్థులు వెళ్లే కాలేజీలు, స్కూళ్ల మార్గంలో సరైనన్ని బస్సులు నడపకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని చెప్పాలి.
శివారు ప్రాంతాలకు కష్టమే
హైదరాబాద్ నగరంలో ఇంజనీరింగ్ కాలేజీలన్ని దాదాపుగా శివారు ప్రాంతంలోనే ఉన్నాయి. స్కూళ్లు సైతం శివారు ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. లింగంపల్లి, పటాన్ చెరు, హయత్ నగర్, ఇబ్రహీంపట్నం, గండిపేట, బాచుపల్లి, ఫిర్జాదీగూడ, ఘట్కేసర్, కాసివాని సింగారం, బాటసింగారాం, ఇలా శివారు ప్రాంతాల్లో చాలా కాలేజీలు విస్తరించి ఉన్నాయి. ఆర్టీసీ బస్సును నమ్ముకుంటే సకాలంలో కాలేజీకి వెళ్తామో కూడా లేదో తెలియని పరిస్థితి. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
సమయానికి వెళ్లాలంటే తప్పదు
నగరంలో మొత్తం 3,500 ఆర్టీసీ బస్సులుండగా.. వీటిలో 900 బస్సులను విద్యార్థుల కోసం నడుపుతున్నట్టుగా ఆర్టీసీ చెబుతోంది. అయితే ఏవిధంగా చూసుకున్నా.. 3,50,000మంది చదువుకునే నగరంలో ఈ బస్సుల సంఖ్య ఎలా సరిపోతుంది?. నగరంలోని కాలేజీలు, స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి కూడా ఇంతే.
దాదాపు చాలామంది ఆర్టీసీ పాసుల మీదే ఆధారపడటంతో.. ఉదయాన్నే బస్టాప్ కు చేరుకుంటారు. బస్సులు ఎంత కిక్కిరిసిపోయినా సరే.. సమయానికి ఆఫీసుకో, కాలేజీకో చేరుకోవాలంటే ఎలాగోలా అందులో దూరాల్సిందే. ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరికేలా లేదు.