ట్యాంక్ బండ్పై ఇక అది కనిపించదు: పీపుల్స్ ప్లాజాకు మార్పు.. ఎందుకు?(ఫోటోలు)
ట్యాంక్ బండ్ రద్దీ ప్రాంతం కావడంతో.. 'లవ్ హైదరాబాద్' సింబల్ కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి.
Recommended Video
హైదరాబాద్: ట్యాంక్ బండ్పై స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచిన 'లవ్ హైదరాబాద్' ఇకపై అక్కడ కనిపించదు. ట్యాంక్ బండ్పై ఉన్న ఆ సింబల్ను పీపుల్స్ ప్లాజాకు తరలించారు అధికారులు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు లవ్ హైదరాబాద్ సింబల్ ను తరలించినట్టు తెలుస్తోంది. ట్యాంక్బండ్ నుంచి నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా వద్దకు ఈ సింబల్ను హెచ్ఎండీఏ అధికారులు తరలించారు.
విశేషంగా ఆకట్టుకున్న సింబల్:
లవ్ హైదరాబాద్ సింబల్ ఇన్నాళ్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంది. ట్యాంక్ బండ్ వచ్చే ప్రతీ ఒక్కరు దాని వద్ద సెల్ఫీ దిగి వెళ్లేవారు. నవంబర్ 25వ తేదీ 2016న మంత్రి కేటీఆర్ దీన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు.
సెల్ఫీ స్పాట్:
లవ్ హైదరాబాద్ స్పాట్ ఐకానిక్ సింబల్ గా మారుతుందని గతంలో కేటీఆర్ చెప్పినట్టే.. చాలామందికి ఇదొక సెల్ఫీ స్పాట్ గా మారింది. అయితే చాలా జంటలు దీనిపై పేర్లు రాసుకుని మరీ సెల్ఫీలు దిగుతున్నాయి. దాంతో 'లవ్ హైదరాబాద్' కళ తప్పింది. రంగు కాస్త వెలిసినట్టయింది.
లవ్ హైదరాబాద్ సింబల్ పై పేర్లు రాస్తుండటంతో.. ఆ అక్షరాలు కనిపించకుండా ఉండేందుకు రంగులు వేయాల్సి వస్తోంది. మళ్లీ మళ్లీ అదే రిపీట్ అవుతుండటంతో.. ఇక ఈ సింబల్ ను ఇక్కడినుంచి తరలించడమే బెటర్ అని హెచ్ఎండీఏ అధికారులు భావించినట్టు సమాచారం.
పీపుల్స్ ప్లాజాకు మార్పు:
లవ్ హైదరాబాద్ సింబల్ ను ట్యాంక్ బండ్ నుంచి పీపుల్స్ ప్లాజాకు తరలించారు. ఎత్తయిన ప్రదేశంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా దీనిపై రాతలు రాయడానికి అవకాశం లేకుండా పోతుంది.
అయితే సెల్ఫీలు దిగేందుకు మాత్రం అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్దమైనట్టు తెలుస్తోంది. బుద్దుడి విగ్రహానికి ఎదురుగా.. ట్యాంక్ బండ్ వ్యూ కనిపించే విధంగా 'లవ్ హైదరాబాద్' సింబల్ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
ట్యాంక్ బండ్పై ఇదీ సమస్య
ట్యాంక్ బండ్ రద్దీ ప్రాంతం కావడంతో.. 'లవ్ హైదరాబాద్' సింబల్ కారణంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చాలామంది వాహనదారులు.. తమ వాహనాలను రోడ్డు పైనే నిలిపి ఇక్కడికొచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అందువల్లే ఈ సింబల్ ను ఇక్కడి నుంచి మార్చివేసినట్టు చెబుతున్నారు.