భారతావని భగభగలే: నిప్పులు కక్కుతున్న సూర్యుడు
ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో తెలంగాణతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ మధ్యలోనే సూర్య భగవానుడు భగభగ మండిపోతున్నాడు
న్యూఢిల్లీ/ హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో తెలంగాణతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏప్రిల్ మధ్యలోనే సూర్య భగవానుడు భగభగ మండిపోతున్నాడు. జమ్ము కశ్మీర్ మొదలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతోపాటు తెలంగాణలోనూ వేసవి తీవ్రత 'నిప్పుల వర్షం' కురుస్తుందా? అన్నచందంగా మారింది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా దాదాపు 5 డిగ్రీలు అదనంగా పెరుగుతున్నందున వడగాలులు సైతం వీస్తున్నాయి.
వందేళ్లలో 2016 అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా రికార్డుల్లోకెక్కింది. ఈ నెలలో అంతకన్నా అధికస్థాయిలో ఎండవేడి పెరుగుతున్నందున ప్రజలు అల్లాడి పోతున్నారు. వరుసగా రెండో ఏడాది ఎండలు మండుతుండటంతో వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా రెండు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత
కాలుష్యం పెరగడం, అడవులు తగ్గిపోవడంతో పాటు భూతాపం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 డిగ్రీల వరకు అధికంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో ఈ వేసవిలో అదనపు పెరుగుదల 4 నుంచి 5 డిగ్రీల వరకు ఉన్నందున ఉష్ణతాపం మరింత వేధిస్తోంది. 2016 వేసవి నుంచి ఇప్పటి వరకు ప్రతీ నెల ఉష్ణోగ్రతల్లో మార్పులు అధికంగానే రికార్డవుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో సోమవారం 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ గత పదేళ్లలో ఏప్రిల్ నెల అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీలు 2016 ఏప్రిల్ 14న నమోదవగా సోమవారం మళ్లీ అంతే ఉంది. ఈ నెలలో ఇంతకన్నా ఎక్కువ నమోదుకావచ్చని అంచనా. ఇది సాధారణంకన్నా 4.6 డిగ్రీలు ఎక్కువ.
ఆదిలాబాద్, పాలమూరుల్లో రికార్డు బద్ధలు
ఇక ఆదిలాబాద్, మహబూబ్నగర్ పట్టణాల్లోనూ ఏప్రిల్ ఉష్ణోగ్రతల్లో పదేళ్ల రికార్డు బద్దలైంది. 2014 ఏప్రిల్ 28న అత్యధికంగా ఆదిలాబాద్లో 43.5 డిగ్రీలు నమోదుకాగా సోమవారం 44 డిగ్రీలు నమోదైంది. మహబూబ్నగర్లో గత ఏడాది ఏప్రిల్ 26న నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 44.2 డిగ్రీలు కాగా సోమవారం 44.5 డిగ్రీలు నమోదైంది.ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు అధికం. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం సాధారణంకన్నా 5 డిగ్రీలు అదనంగా పెరిగితే వడగాలుల తీవ్రత ఎక్కువవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈశాన్య రుతు పవనాలు ముఖం చాటేసినందుకేనా?
గత అక్టోబర్ నుంచి సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు వర్షాలు కురవాలి. ఈసారి అవి పూర్తిగా ముఖం చాటేశాయి. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు ఏ ఒక్క నెలలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. పైగా కొన్ని జిల్లాల్లో వర్షపాతం లోటు గరిష్ఠంగా 90 శాతానికి చేరింది.
మండుతున్న ఉత్తర భారతావని
ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో పూర్తిగా వేడి వాతావరణం నెలకొన్నది. ఛండీగఢ్లో గత ఏడేళ్లలో రికార్డు స్థాయిలో ఆదివారం పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఎండ తీవ్రత పెరిగినందున దక్షిణ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల పరిధిలో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రధానంగా హర్యానాలోని హిస్సార్, సిర్సా, ఫతేహాబాద్, భీవండీ, రేవరీ, రోహతక్, జాజ్జర్, గుర్గావ్ జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తెలిపింది.
ఈ మూడు రాష్ట్రాల పరిధిలో గత వారంతో పోలిస్తే పగటి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రత పెరుగడంతో 20వ తేదీన స్వల్ప జల్లులు కురిసే అవకాశం ఉంది. సోమవారం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదయ్యాయి. ఇక జమ్ముకశ్మీర్, ఢిల్లీల్లో వేడిగాలులు వీస్తాయని, ఈశాన్య రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నదని స్కైమెట్ అనే ప్రయివేట్ వాతావరణ అధ్యయన సంస్థ పేర్కొంది. వేడి తీవ్రత పెరిగి పోవడం వల్ల మార్కెట్లో ఎయిర్ కూలర్లకు గిరాకీ పెరిగింది.












Click it and Unblock the Notifications