అద్భుతం: 45 ని.లు ఆగిన గుండె మళ్లీ కొట్టుకుంది, వైద్యుల ఘనత.. ఇలా
చెన్నై: చెన్నైలో అద్భుతం జరిగింది! ఓ వ్యక్తి గుండె 45 నిమిషాల పాటు కొట్టుకోవడం ఆగిపోయింది. అయినప్పటికి అతను బతికి బట్టకట్టాడు. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు జయ్సుఖ్భాయ్ ఠాకూర్. అతను గుజరాత్కు చెందిన వ్యక్తి. చెన్నైలోని ఫోర్టిస్ మలర్ వైద్యులు 45 నిమిషాలు ఆగిపోయిన గుండెను మళ్లీ స్పందించేలా చేశారు.
ఈ అరుదైన శస్త్ర చికిత్సలో వైద్యులు విజయం సాధించారు. గుజరాత్కు చెందిన జయ్సుఖ్భాయ్ వయస్సు 38 ఏళ్లు. అతను హృద్రోగ సమస్య ఉండటంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఆయనను విమానంలో పోర్బందర్ నుంచి చెన్నైకి తీసుకొచ్చి ఫోర్టిస్ మలర్ ఆసుపత్రిలో చేర్పించారు.
గుండెమార్పిడి శస్త్రచికిత్స అవసరం కావడంతో దాత గుండె లభించేవరకు మందుల ద్వారా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు వైద్యులు ప్రయత్నించారు. అకస్మాత్తుగా ఆయనకు హర్ట్ బీట్ ఆగిపోయింది. 45 నిమిషాల పాటు వైద్యులు ప్రయత్నించి సంక్లిష్టమైన వైద్య విధానం ద్వారా గుండెను కొట్టుకునేలా చేశారు.

ఈ నేపథ్యంలో విలేకర్ల సమావేశంలో ఆసుపత్రి కార్డియాక్ సైన్సెస్ సంచాలకులు డా.బాలకృష్ణన్ మాట్లాడారు. గుండెపోటు పరిస్థితుల్లో ఈసిపిఆర్ అనే చికిత్సా విధానం ద్వారా రోగి బతికేందుకు అవకాశాలున్నాయని, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ వైద్య విధానం సంక్లిష్టమైనదనీ తెలిపారు.
జయ్సుఖ్భాయ్ విషయంలోనూ ఇదే విధానం అనుసరించామన్నారు. గుండె, కాలేయ కృత్రిమ యంత్రాన్ని ఉపయోగించామన్నారు. ఈ చికిత్స అనంతరం రోగి గుండె కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ ఆయన పది రోజుల పాటు కోమా దశలోనే చికిత్సలు పొందారని, స్పృహలోకి రాగానే ఆయనకు గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించామన్నారు. పూర్తిస్థాయిలో కోలుకున్నారని, డిశ్చార్జ్ కానున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా జయ్సుఖ్భాయ్ మాట్లాడుతూ... నేను కొత్త జీవితాన్ని పొందానని చెప్పాడు. జయ్సుఖ్భాయ్ మంగళవారం నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు అతనికి పుష్పగుచ్ఛం ఇచ్చారు.












Click it and Unblock the Notifications