ఇస్లామాబాద్లో ఆలయం: నెరవేరనున్న హిందువుల చిరకాల వాంఛ
పాక్ రాజధాని ఇస్లామాబాదులో హిందువులు గత కొంతకాలంగా ఓ దేవాలయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డిమాండుకు ఫలితం దక్కే సమయం వచ్చింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో నివసిస్తున్న హిందువులకు శుభవార్త. పాక్ రాజధాని ఇస్లామాబాదులో హిందువులు గత కొంతకాలంగా ఓ దేవాలయం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డిమాండుకు ఫలితం దక్కే సమయం వచ్చింది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో నివసించే హిందువుల కోసం మొదటి సారిగా దేవాలయాన్ని నిర్మించేందుకు ఎట్టకేలకు అంగీకరించారు. అందుకోసం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు కాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటించింది.
శుక్రవారం జరిగిన కాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశంలో ఆలయానికి స్థలాన్ని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికలో వార్తలు వచ్చాయి. సెక్టార్ హెచ్9 కింద అరెకరం స్థలాన్ని ఆలయానికి కేటాయించారు. దీంతో పాటు హిందువుల కోసం కమ్యూనిటీ కేంద్రాన్ని, శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నారు. సీడీఏ నిర్ణయంతో హిందువుల చిరకాల వాంఛ తీరబోతుందని చెబుతున్నారు.
ఇస్లాబామాబుదాలు సుమారు 800 మంది హిందువులు నివసిస్తున్నారు. ఆలయం లేక దీపావళి వంటి పెద్ద పండుగలను ఇళ్ల వద్దే జరుపుకోవాల్సి వస్తోంది. ఇప్పటి వరకు అక్కడ హిందువుల కోసం ప్రత్యేకంగా శ్మశానవాటిక లేదు. మృతి చెందిన వారిని రావల్పిండి లేదా తమ స్వస్థలాలకు తీసుకొచ్చి ఖననం చేయాల్సి వచ్చేది. ఇస్లామాబాద్, రావల్పిండి జంటనగరాల్లోని పెద్ద దేవాలయం అంటే సద్దార్లో ఉన్న కృష్ణ మందిర్ ఒక్కటే.