మహిళలపై అత్యాచారాలు: ఆటోలంటే హడల్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నగరంలో మహిళలపై కీచకపర్వాలకు అంతు లేకుండా పోయింది. ఆటోలు ఎక్కాలంటే కూడా మహిళలు భయపడుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నది అధికంగా ఆటోడ్రైవర్లు కావడం ఆలోచించాల్సిన విషయంగా మారింది. ఐటి హబ్గా భాసిల్లుతున్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అధికంగా మహిళలపై అరాచకాలు జరగడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
మూడేళ్ల క్రితం ఓ మహిళ ఉద్యోగి అమీర్పేట నుండి మాదాపూర్ సొల్యూన్ షాపుకు వచ్చి వెళ్తుంటే ఆటో డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆటోడ్రైవర్తోపాటు మరో ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నిస్తే ఆమె పారిపోయింది. రెండు సంవత్సరాల క్రితం రాంఖీ టవర్స్లో నివాసముండే మహిళ ఉదయం వాకింగ్ చేస్తుంటే క్యాబ్ డ్రైవర్ ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.

ఉప్పల్ నుండి నల్లగొండకు పనికి వెళ్లేందుకు భార్యాభర్తలు ఆటోలో వెళ్తుంటే భర్తను నెట్టివేసి నిర్మానుష ప్రాంతంలోకి తీసుకువెళ్లి ఆమెను దారుణంగా ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. నాలుగురోజుల క్రితం నగరంలో వినాయక నిమజ్జనం తిలకించడానికి వచ్చిన మహిళలను నలుగురు యువకులు అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. అన్ని సంఘటనలలో ఆటో డ్రైవర్లే ముఖ్య పాత్ర పోషించడం ఆందోళనకరమైన విషయం.
ఐటి సెక్టార్లో ఎక్కువ శాతం మంది మహిళలు పనిచేస్తున్నారు. ఉద్యోగులు నివాసముంటున్న ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం తక్కువగా ఉండడంతోపాటు ఆటో అయితే అనువుగా ఉంటుందని మహిళలు ఎక్కువగా ఆటోలనే ఆశ్రయిస్తున్నారు. ఐటి సంస్థలు క్యాబ్స్లాంటి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటుచేసినా ఆటోల్లో ప్రయాణం తప్పడం లేదు. అఘాయిత్యాలు జరిగినప్పుడు నిందితులను పోలీసులు పట్టుకుని జైలుకి పంపిస్తున్నారు. అయినా ఘోరాలు ఆగడం లేదు.
అయితే, కొంత మంది ఆటో డ్రైవర్లు అటువంటి చర్యలకు దిగినంత మాత్రాన హైదరాబాదులోని అందరూ ఆటో డ్రైవర్లను నిందించలేం. అయితే, జరుగుతున్న సంఘటనలు ఆ సమూహంపై మొత్తానికి మచ్చను తెచ్చిపెడుతున్నాయి.












Click it and Unblock the Notifications