అమ్మో!..ఒక్క రొయ్య...కిలో వెయ్యా?...అదే ఆళ్ల రొయ్య స్పెషాలిటీ...
విశాఖపట్నం సాగర్నగర్ మత్స్యకారులకు శనివారం కాసుల పంట పండింది. కారణం వాళ్లకు ఆరోజు వాళ్ల వలలో అత్యంత అరుదుగా లభించే భారీ సైజు ఆళ్ల రొయ్యలు పడటమే. ఒక్కోటి కనీసం కిలో బరువు తూగే వీటి కోసం కొనుగోలుదారులు ఎగబడతారు. అలా వీటిని కిలో వేయి రూపాయలకు తగ్గకుండా విక్రయిస్తారు.
కనీస బరువే...ఒక కిలో
మన దేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి ఈ "రాక్, స్పినీ లాబ్స్టర్స్" అని పిలిచే భారీ సైజు రొయ్యలకు చాలా ప్రసిద్ధి. బాగా పెరిగిన ఈ రొయ్య సగటున కనీస బరువు కిలో నుంచి 7 కిలోల వరకు తూగుతాయి.
బైట మార్కెట్లో...కిలో 2 వేల పైమాటే...
ఈ లాబ్స్టర్ల ధర బైట మార్కెట్లో కిలో 2 వేల రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్ కల్చర్ద్వారా ప్రత్యేకంగా పెంచబడే ఈ లాబ్స్టర్లను ఎక్కువగా జపాన్, హాంకాంగ్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.
మనదేశంలో...ఎక్కడెక్కడంటే...
మన దేశంలో కన్యాకుమారి, మండపం, కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ లాబ్స్టర్లు ఎక్కువగా దొరుకుతుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టే వీటికి రాక్ లాబ్స్టర్స్ అనే పేరు వచ్చింది.
దొరకడం...చాలా కష్టం...
ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేందుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తుంటారు.