కిలిమంజారోపై జెండా ఎగిరేసిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు(పిక్చర్స్)
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థినీ విద్యార్థులు ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోమించారు.
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థినీ విద్యార్థులు ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటైన ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోమించారు. విశాఖలోని తూర్పు నౌకదళంలో పనిచేస్తున్న కమాండర్ ఎస్ కార్తికేయన్ కుమార్తె కామ్య తన తల్లి లావణ్య కార్తికేయన్తో కలిసి ఆఫ్రికాలోని 5685 మీటర్లు/18652 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ కిలిమంజారోను అధిరోహించింది.
కామ్య తన తల్లితో కలిసి ఈనెల 20న టాంజానియాకు చేరుకుంది. అక్కడి నుంచి కిలిమంజారో నేషనల్ పార్క్ నుంచి 21న పర్వతారోహణకు బయల్దేరింది. పర్వతారోహణ సమయంలో భయంకరమైన శీతలగాలులు, అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య నాలుగు రోజులపాటు ప్రయాణించి కిలిమంజారో పర్యత శిఖరంమీద ఉన్న గిల్మెన్ పాయింట్ను 25న చేరుకుని, అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఆమె ఎగురవేసింది.
ప్రపంచ రికార్డు..
కేవలం ఆరు నెలల వ్యవధిలో కామ్య మూడు అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహించింది. ఈ ఏడాది మే నెలలో కామ్య నేపాల్లో 17,600 అడుగుల ఎత్తున ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకుంది. ఇప్పటి వరకూ ఈ బేస్ క్యాంప్ను చేరుకున్న రెండవ అతి పిన్నవయసు బాలికగా కామ్య గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఆగస్ట్లో 20 వేల అడుగుల ఎత్తున ఉన్న మౌంట్ స్టాక్ కంగ్రిని అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించింది. పిన్నవయసులోనే అత్యంత సాహసోపేతంగా పర్వత శిఖరాలను అధిరోహించిన కామ్యను నేవీ కుటుంబం అంతా ప్రశంసించింది.
కిలిమంజారోపై తెలంగాణ గురుకులం..
తెలంగాణ మైనార్టీ గురుకులాలకు చెందిన నలుగురు విద్యార్థులు టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించిన విద్యార్థులు ఈ ఘనత సాధించారని మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి బి షఫీయుల్లా తెలిపారు.
అధిరోహించింది వీరే..
సంగారెడ్డి, వరంగల్ గురుకుల బాలుర పాఠశాలల విద్యార్థులు డి.భాస్కర్, ఎస్.కె.ఫెరోజ్,.. బోధన్, గజ్వేల్ బాలికల గురుకుల పాఠశాలల విద్యార్థినులు సిద్రా తుల్ ముంతాహ, బి.రాణి పర్వతాన్ని అధిరోహించిన బృందంలో ఉన్నారు.
వియజసూచికలు
పేద కుటుంబాలకు చెందిన వీరంతా క్రీడారంగంలో చూపిన ప్రతిభ, అంకితభావాన్ని పరిగణనలోకి తీసుకుని పర్వతారోహణలో శిక్షణ ఇప్పించామని షఫీయుల్లా వివరించారు. పర్వతాన్ని అధిరోహించిన సందర్భంగా విద్యార్థులు విజయసూచికగా జాతీయపతాకాన్ని, మైనార్టీ గురకులాల సొసైటీ లోగోను ప్రదర్శించినట్టు చెప్పారు.
మోడీ చిత్రంతో..
కాగా, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడ గ్రామానికి చెందిన దాదె సునీల్ అక్టోబర్ 19న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించేందుకు ఏడుగురు బృందంతో వెళ్లాడు. శుక్రవారం ఉదయానికి పర్వత శిఖరాన్ని చేరాడు. ఈ సందర్భంగా జాతీయ పతాకంతోపాటు.. ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని ప్రదర్శించాడు సునీల్.