దంచి కొడుతున్న ఎండలు... మార్చిలోనే వేసవి మంటలు!
Recommended Video
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే, మార్చి నెల తొలి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం వేళల్లో భగభగ మండుతున్న ఎండల్ని చూసి ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి వచ్చేందుకే భయపడుతున్నారు.
ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో రికార్డు స్థాయికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
సాధారణం కంటే అధికం...
వేసవిలో ఎండ తీవ్రత ఏటికేడాది క్రమంగా పెరుగుతోంది. కొన్ని దశబ్దాలుగా పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకరణతో కాలుష్యం అధికమవుతోందని, ఈ కారణంగానే ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల నమోదవుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. భూతాపం పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా 1900 నుంచి ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.9 డిగ్రీల నుంచి ఒక డిగ్రీ సెల్సియస్ మేర పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు.
పెరుగుతున్న సగటు ఉష్ణోగ్రత...
యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ స్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యయనం ప్రకారం దశాబ్దానికి సగటున ఉష్ణోగ్రత 0.17 డిగ్రీల సెల్సియస్ పెరుగుతోంది. నాసా లెక్కల ప్రకారం1951 నుంచి 1980 మధ్య నమోదైన సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2017లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 0.9 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. కాలుష్యాన్ని తగ్గించే చర్యలపై దృష్టి పెట్టకపోతే ఉష్ణోగ్రతలు మరింత పెరిగి ముప్పువాటిల్లే ప్రమాదాలు ఉన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
తీవ్రం కానున్న వడగాలులు...
రాబోయే రోజుల్లో తీవ్రమైన వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈసారి ఎండల తీవ్రత పంటలపై కూడా ప్రభావం చూపనుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వేసవిలో ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉండనుందన్న ముందస్తు సంకేతాలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వడదెబ్బ బారినపడకుండా ప్రజలను రక్షించేందుకు ఇప్పటికే వేసవి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది.
ఉత్తర తెలంగాణలో మరింతగా...
ఉత్తర తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ పరిధిలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాయువ్యం నుంచి వచ్చే వేడిగాలులే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో 46 డిగ్రీల సెల్సియస్కుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్లోనూ భగభగలు...
మార్చి తొలివారం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో హైదరాబాద్లోనూ ఎండ తీవ్రత పెరుగుతోంది. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుండటంతో మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.