జియో గేమ్ ప్లాన్: కన్సాలిడేషన్ దిశగా టెలికం
ఆరు రాష్ట్రాల పరిధిలోని టెలీనార్ (భారత్) ఆపరేషన్లను కొనుగోలు చేయనున్నట్లు భారతీ ఎయిర్ టెల్ గురువారం ప్రకటించింది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు మాత్రం బహిర్గతం కాలేదు.
న్యూఢిల్లీ: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ టెలీ కమ్యూనికేషన్స్ సంస్థ 'రిలయన్స్ జియో' విసిరిన సవాల్తో దేశీయ ప్రైవేట్ టెలీకం ఆపరేటర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా వన్ టైమ్ చెల్లింపులతోపాటు కొంత రుసుముతో అన్ లిమిటెడ్ కాల్స్కు అనుమతినిస్తూ రిలయన్స్ జియో తీసుకున్న నిర్ణయం ఇతర టెలికం ఆపరేటర్ల పునాదులు కదిలిస్తోంది.
ప్రస్తుతం ఫోన్ వినియోగదారులు, మార్చి 31లోగా కొత్త కనెక్షన్ తీసుకున్న వారు 99 చెల్లిస్తే సరి వచ్చే ఏడాది మార్చి వరకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. అపరిమిత డేటా వినియోగానికి రూ.303 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో అత్యధికులు రిలయన్స్ జియో వైపు మళ్లుతుండటంతో మిగతా టెలికం సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో బలోపేతం కావడానికి ఇప్పటివరకు దేశీయంగా అతిపెద్ద టెలికం ఆపరేటర్గా ఉన్న ఎయిర్ టెల్.. నార్వేకు చెందిన టెలికం సంస్థ భారత్ యూనిట్ 'టెలీనార్' ఆపరేషన్స్ కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా భారత టెలికం రంగంలో మరో ఏకీకరణకు రంగం సిద్ధమవుతున్నది.
ఆషామాషీ నిర్ణయం కాదు: టెలినార్
ఆరు రాష్ట్రాల పరిధిలో టెలీనార్ కార్యకలాపాలను ఎయిర్టెల్ కొనుగోలు చేయనున్నట్లు ఆ రెండు సంస్థల సన్నిహిత వర్గాల కథనం. అయితే ధర ఎంత అన్న విషయం మాత్రం బహిర్గతం కాలేదు. భారత టెలికం రంగం నుంచి వైదొలగాలన్న నిర్ణయం ఆషామాషీగా తీసుకోలేదని టెలినార్ గ్రూపు సీఈవో సిగ్వే బ్రెక్కే తెలిపారు. భవిష్యత్లో భారత టెలికం రంగంలో గణనీయ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, కానీ అదే స్థాయిలో రిటర్న్స్ ఆశించడం కష్ట సాధ్యంగా మారిందని తెలిపారు. ఆరు రాష్ట్రాల్లో టెలినార్ ఆపరేషన్స్ను కొనుగోలుచేయడం వల్ల ఎయిర్టెల్కు భారీగా లబ్ది చేకూరనున్నదని టెలికం పారిశ్రామి వర్గాలు చెప్తున్నాయి.
లాభాలు తగ్గిన ఎయిర్ టెల్, నాలుగేళ్లలో తొలిసారి ఐడియాకు నష్టాలు
గతేడాది టెలీకమ్యూనికేషన్ల రంగంలో అడుగు పెడుతూనే కొద్ది కాలం పాటు ఫ్రీ వాయిస్ కాల్స్ పై రాయితీ ప్లాన్లు ప్రకటించడంతో మిగతా ఆపరేటర్లు గగ్గోలు పెట్టారు. తొలిసారి అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో భారతీ ఎయిర్ టెల్ లాభాలు తగ్గిపోగా, ఐడియా సెల్యూలార్ నాలుగేళ్లలో మొదటిసారి నష్టాలను చవిచూసింది. జియో గేమ్ ప్లాన్తో మిగతా టెలికం ఆపరేటర్లు కన్సాలిడేషన్ దిశగా అడుగులేస్తున్నాయి.
ఐడియాతో విలీనానికి వొడాఫోన్ సై
బ్రిటన్కు చెందిన వొడాఫోన్ గ్రూప్ ఇంతకుముందే ఐడియా సెల్యూలార్ సంస్థతో విలీనంపై సంప్రదింపులు జరిపింది. భారత్ లో ఐడియా సెల్యూలార్ విక్రయాలు 12 బిలియన్ డాలర్లుగా ఉన్నది. దీనికి ముందు అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్, మరో ప్రైవేట్ ఆపరేటర్ ఎయిర్ సెల్ తో విలీన ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇదే గ్రూపులో టాటా టెలీ కమ్యూనికేషన్స్ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.