అద్భుత కళా నిలయం: 1100ఏళ్ల పట్టణం ఐనవోలు
కాకతీయుల పాలన కంటే కూడా అతి ముఖ్యమైన చారిత్రక ప్రాంతం ఐనవోలు.
వరంగల్: కాకతీయుల పాలన కంటే కూడా అతి ముఖ్యమైన చారిత్రక ప్రాంతం ఐనవోలు. ఆ గ్రామంలో అడుగడుగునా విశేష చారిత్రక సంపద దాగి ఉన్నదని చరిత్ర పరిశోధకులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ ప్రతి సంక్రాంతికి ముందు జరిపే ఆర్భాటపు ఏర్పాట్లు తప్ప శాశ్వత ఏర్పాట్లపై పాలకులు దృష్టి సారించడంలేదు.
ప్రత్యేకంగా ఇప్పుడు వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్న అతి కొద్ది జాతరల్లో ఐనవోలు అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉంది. ప్రజలు, పాలకులు, చరిత్ర పరిశోధకులు తలచుకంటే మరో వేములవాడను తపించేలా భక్తులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు వేస్తే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాననికి భారీ సంఖ్యలో భక్తులను, పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు ఉంటాయి.
అత్యంత పురాతన పట్టణం...
ఐనవోలు చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే అత్యంత పురాతన పట్టణమని అవగతమవుతోంది. వరంగల్ కోట నిర్మాణానికి వందల ఏళ్ల క్రితమే ఐనవోలు గ్రామం ఉన్నట్లు తెలుస్తోంది. కళ్యాణి చాళుక్యుల కాలంలోని అయ్యన-1 అనే రాజకు రాష్ట్రకూటుల కాలానికి చెందిన రాజు కృష్ణ-2 వివాహ బహుమతిగా ఈ గ్రామాన్ని ఇచ్చారు. ఈ విషయానన్ని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు గులాం ఎజ్జాని పరిశోధన పత్రాల (ఓపీ, సీఐీ,పీ, 319)లో వివరించారు. వీటి ఆధారాలుగా పరిశీలిస్తే కాకతీయులకు ముందు కనీసం వేయి సంవత్సరాలకు ముందే ఐనవోలు గ్రామం ఏర్పడినట్లు చరిత్ర పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల పాలన
రాష్ట్రకూటుల తర్వాత, చాళుక్యుల పాలనలోకి వచ్చారు. ఈ చాళుక్యుల సామంత రాజులుగా ఉన్న కాకతీయులు కాలక్రమంలో స్వతంత్ర రాజులుగా ఓరుగల్లు గడ్డను ఏలిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కూటుల కాలంలోనే ఈ గ్రామం ప్రస్తావన ఉందంటే అత్యంత పురాతన పట్టణమని దీన్ని గుర్తించొచ్చు. రాష్ట్ర కూట రాజు కృష్ణ-2 పాలనా కాలం 850 నుంచి 914 ఏళ్ల వరకు కొనసాగింది. అంటే దాదాపు 1100 సంవత్సరాలకు ముందునుంచే ఐనవోలు ఉందని చారిత్రక ఆధారాలనుబట్టి స్పష్టమవుతోంది.
అయ్యన-1 పాలనా కాలంలో...
నేటి ఐనవోలు, ఐలోని గ్రామానికి ఈ పేరు రావడానికి ఎన్నో చారిత్రక అంశాలు ప్రచారంలో ఉన్నాయి. కాకతీయుల కాలంలోని అయ్యన్న దేవుడి అనే మంత్రి వల్ల ఈ ఊరుకు ఐనవోలు అనే పేరు రాలేదని తేలింది. కాకతీయులకంటే ఎంతో ముందుగానే చాళుక్యుల కాలంలోని అయ్యన-1 అనే పాలకుడి కాలంలోనే ఈ పట్టణం అయ్యనవోలుగా పేరొందినట్లు పేర్కొంటున్నారు.
వ్యూహాత్మక సైనిక స్థావరం...
ఐనవోలు రాష్ట్ర కూటుల కాలం నుంచి చాళుక్యులు, కాకతీయుల, పద్మనాయకులు పాలన వరకు ఐనవోలు కీలకమైన సైనిక స్థావరం. భారీ సైనిక పాలంతోపాటు ఈ ప్రాంతంలో ధన, ధాన్యాగారాలు ఉండేవని చెబుతారు. కాకతీయ చక్రవర్తులు గణపతి దేవుడు, రుద్రమ దేవి ఈ ప్రాంతాన్ని యుద్ధ వ్యూహాలను రచించే ప్రాంతంగా ఎంచుకున్నారని ఆధారాలు వెల్లడయ్యాయి.
వరంగల్ కోట నుంచి 15 కి.మీ. దూరంలోనే ఉన్న ఈ ఐనవోలుకు యుద్ధరంగానికి సిద్ధమయ్యే ముందు రుద్రమదేవి ఐనవోలు దేవస్థానానికి వచ్చి ఆశీర్వాదం పొందేవారని ప్రచారంలో ఉంది. సైనిక దళాలను ఉత్తేజితులను చేసేందుకు విశాలమైన నాట్య మండపం ఇక్కడ ఉంది. సైనికులకు ప్రేరణ కలిగించే పేరిణి నృత్య ప్రదర్శన ఇక్కడ జరిగేదట.