న్యూఇయర్: మూగబోయిన వాట్సప్, కారణం ఇది
హైదరాబాద్: కొత్త సంవత్సరం 2016 వచ్చేసింది. దీంతో చాలా మంది తమ బంధవులు, స్నేహితులు ఇలా అందరికీ శుభాకాంక్షలు చెబుతామని మెసేజింగ్ దిగ్గజం వాట్సప్ యాప్ను ఆశ్రయించారు. అయితే వారందరినీ వాట్సప్ నిరాశ పర్చింది. ఒక్కసారిగా వాట్సప్కు ట్రాఫిక్ పెరగడంతో కొన్ని గంటల పాటు వాట్సప్ సేవలు నిలిచిపోయాయి.
ముఖ్యంగా లండన్, పశ్చిమ యూరప్ దేశాల్లో వాట్సప్ బాగా ఇబ్బంది పెట్టినట్లు డౌన్డిటెక్టర్ అనే వెబ్సైట్ ఒక ఆర్టికల్లో పేర్కొంది. ఇంటర్నెట్, మొబైల్ సేవలు వినియోగం నిజ సమయంలో ఎలా ఉన్నాయన్న విషయాన్ని ఈ వెబ్సైట్ తెలియజేస్తుంది.
"ఈ ఉదయం వాట్సప్ ఓపెన్ కావడం లేదని కొందరు ఫిర్యాదు చేశారు. ఆపై సమస్యను పరిష్కరించాం. ఊహించని విధంగా కోట్లాదిమంది ఒకే సమయంలో యాప్ ఓపెన్ చేయడంతోనే ఇలా జరిగింది. అసౌకర్యానికి చింతిస్తున్నాం. కొద్దిగా డేటా బట్వాడా ఆలస్యమవుతున్నా, ప్రస్తుతం యాప్ ఓపెన్ అవుతోంది" అని వాట్స్ యాప్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
కాగా, భారత్లో గత రాత్రి 12 గంటల నుంచే కొన్ని ప్రాంతాల్లో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. మెసేజిలు పంపడానికి, అందుకోడానికి కూడా సమస్యగానే ఉందని కొందరు వినియోగదారులు తెలిపారు. అయితే శుక్రవారం ఉదయం పరిమిత సంఖ్యలో వాట్సప్ను ఉపయోగించుకోగలిగారు.
ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు వాట్సప్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఇలా సేవలు నిలిచిపోవడానికి గాల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్ల మంది వాట్సప్ వాడుతున్నారని ఫేస్బుక్ చెబుతోంది.