నరకప్రాయంగా యువత జీవితం: పెరుగుతున్న బలవన్మరణాలు
అమ్మానాన్న.. స్నేహితులు.. పుస్తకాలు.. చదువులు.. ఆటలు.. సినిమాలు.. పెళ్లి.. భార్య.. పిల్లలు.. ఇలా ఆనందంగా హాయిగా గడిచిపోవాల్సిన వయస్సది. కానీ దేశంలో చాలా మందికి అదే నరక ప్రాయంగా మారుతోంది.
హైదరాబాద్: అమ్మానాన్న.. స్నేహితులు.. పుస్తకాలు.. చదువులు.. ఆటలు.. సినిమాలు.. పెళ్లి.. భార్య.. పిల్లలు.. ఇలా ఆనందంగా హాయిగా గడిచిపోవాల్సిన వయస్సది. కానీ దేశంలో చాలా మందికి అదే నరక ప్రాయంగా మారుతోంది. తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక.. పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించలేక.. నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
చదువులో రాణించినా.. మంచి ఉద్యోగం లేక.. ఉద్యోగం వచ్చినా మంచి అమ్మాయి దొరకక.. దొరికినా.. బంధాన్ని బలోపేతం చేసుకోలేక.. సతమతం అవుతున్నారు. ప్రతి చిన్న సమస్యనూ భూతద్దంలో చూస్తూ.. ఆందోళనతో కుంగుబాటులో కూరుకుపోయి.. ఆత్మహత్య చేసుకుంటున్నారు. వివిధ దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే ఎక్కువ మంది యువత చనిపోతున్నారు. దేశంలో గంటకో విద్యార్థి తనువు చాలిస్తున్నాడని జాతీయ నేర గణాంక విభాగం 2015 వార్షిక లెక్కలు తెలిపాయి.
ఆడిపాడే వయసులో ఆత్మహత్యలు పెరగడానికి కుటుంబాలే కారణమని మానసిక నిపుణులు, అధ్యయనాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఆర్థిక సమస్యలే కుంగుబాటుకు అసలు కారణమని వివరించాయి. దేశంలో ఆత్మహత్య చేసుకున్న యువత కుటుంబాల నేపథ్యంపై జరిగిన అధ్యయనంలో 70 శాతం బాధితుల ఆదాయం ఏడాదికి లక్షలోపే ఉన్నట్లు తేలింది. విద్యార్థులకు సకాలంలో కౌన్సెలింగ్ అందించడం ద్వారా ఈ ఆత్మహత్యలను నియంత్రించ వచ్చని.. అయితే ఆ కౌన్సెలింగ్ ఇవ్వడానికి సరిపడా నిపుణులే లేరని మానసిక వైద్యులు అంటున్నారు.
వెంటాడుతున్న మానసిక వైద్యుల కొరత
లక్ష మంది జనాభాకు ఆరుగురు మానసిక నిపుణులు అవసరం కాగా, మన దేశంలో ఒక్కరు కూడా లేరు. పది లక్షల మంది జనాభాకు కేవలం ముగ్గురు లేకుంటే నలుగురే ఉన్నారు. ఈ పరిస్థితి మారకుంటే.. విద్యార్థులు.. యువత ఆత్మహత్యలు భవిష్యత్లో మరింత పెరుగుతాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుబాటులో ఉన్న మానసిక వైద్యులు కేవలం 14 శాతం మంది మాత్రమేనని చెప్తున్నారు. దేశంలో నాలుగు వేల మంది సైక్రియాట్రిస్టులు ఉన్నారు. సైకాలజిస్టులు కేవలం వెయ్యి మంది మాత్రమే ఉన్నారని.. జనాభాతో పోలిస్తే కనీసం 65 వేల మంది మానసిక నిపుణులు అవసరమని తెలుస్తున్నది.
పిల్లలకు చిన్నప్పటి నుంచీ తమ ప్రాణం కన్నా మించింది.. విలువైంది మరోటి లేదన్న సంగతిని సందర్భానుసారంగా వివరించాలని సూచించారు. ఆనందమయమైన కుటుంబాల్లో పిల్లలకు మానసిక సమస్యలు రావని.. వారు ఆత్మహత్యల జోలికి వెళ్లరని వివరించారు. మరోవైపు అభివృద్ధి చెందిన దేశాల్లో మానసిక ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు బడ్జెట్లో నాలుగు శాతం వరకు కేటాయిస్తుండగా.. మన వద్ద కేవలం 0.06 శాతమే వెచ్చిస్తున్నారు. మరోవైపు ప్రపంచంలో కేవలం రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1.15 లక్షల టీనేజర్లు చనిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న టీనేజర్లు 68 వేల మంది కావడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సగటుకంటే ఎక్కువే
దేశ వ్యాప్తంగా లక్షకు దాదాపు పది మంది బలవ్నర్మణాలకు పాల్పడుతోంటే.. ఈ రేటు తెలుగు రాష్ర్టాల్లో చాలా ఎక్కువగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షకు 15 మంది వరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వీరిలోనూ 14-30 ఏళ్ల మధ్య యువతే ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ర్టాల్లో గత 20 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఎన్సీఆర్బీ డేటా చెబుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ర్టాలతో పోల్చినపుడు తెలుగు రాష్ర్టాల్లో యువత ఆత్మహత్యలు తక్కువగా కనిపించినా.. ఆందోళనకర స్థాయిలోనే ఉన్నాయి.
ఏటా ఆత్మహత్య చేసుకుంటున్న యువత దాదాపు 9000 మంది ఉంటున్నారు. అయిదేళ్లలో తనువు చాలించిన వారి సంఖ్య 40వేల మంది కాగా, మొత్తం ఆత్మహత్యల్లో యువత 40 శాతం మంది ఉన్నారు. పరీక్షలలో ఫైయిలైనా, ఇతర కారణాలతో కుంగుబాటుకు గురికావడం జరుగుతున్నది. నిరుద్యోగం, కుటుంబ ఆర్థిక సమస్యలు, కెరీర్ లో ఇబ్బందులు, సంబంధాలపై సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఆత్మహత్యలు జరుగుతున్నాయని వాస్తవ పరిస్థితులు చెప్తున్నాయి.