బిజెపికి భవిష్యత్తు లేదా?
ఎల్ కె అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ ల నాయకత్వ లోపమే ఈ పరిస్థితికి కారణమని అనుకోవడానికి లేదు. బిజెపికి వేరేవారు నాయకత్వం వహించినా పరిస్థితి అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల నాయకత్వం ముందు కాంగ్రెసుకు ముఖంగా కనిపిస్తున్నప్పటికీ పలువురు కాంగ్రెసు నాయకులు ప్రజల మనోభావాలను తమ వైపు తిప్పుకోవడానికి పకడ్బందీ వ్యూహంతో పనిచేస్తున్నారు. ప్రజల ప్రతి సమస్యనూ పట్టించుకుంటామనే హామీని ఇవ్వగలుగుతున్నారు. సమస్యలు పరిష్కారమవుతున్నాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెసుకన్నా భిన్నమైన పాలనను బిజెపి అందిచలేదనే అవగాహనకు భారత ప్రజలు వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది. గత బిజెపి పాలనానుభవం ద్వారా ఆ విషయాన్ని ప్రజలు పసిగట్టారని చెప్పవచ్చు.
మరో ప్రధానమైన అంశం కూడా ఉంది. దేశంలో ఇస్లాం ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలకు బిజెపి ప్రాబల్యమే కారణమనే భావన ప్రజల్లో నాటుకుపోయి ఉంది. స్థానికంగా ఉండే ముస్లింలకు, హిందువులకు వైరం లేదు. కలిసి జీవించడానికి వారి మధ్య ఒక బయటకు వెల్లడి కాని అవగాహన ఉంది. ముస్లిం వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతాయనే భావన ప్రజల్లో ఉందని చెప్పవచ్చు. హిందూ రాజ్యం తేవడం వల్ల తమ కష్టాలు తీరుతాయనే నమ్మకం కూడా వారికి లేదు. ప్రస్తుతం ప్రజలు ప్రశాంత జీవనాన్నే కోరుకుంటున్నారు. అందువల్ల బిజెపి మత ఎజెండాకు కాలం చెల్లింది. ఈ విషయాన్ని బిజెపి గుర్తించినట్లు లేదు. అందుకే అది దేశంలో కోలుకోవడానికి వీలు కూడా లేని పరిస్థితులున్నాయి.
బిజెపి ఆర్థిక, విదేశాంగ విధానాల్లో కాంగ్రెసుకు భిన్నమైన పాలనను అందించలేదనే విషయాన్ని కూడా ప్రజలు గమనించారు. అందువల్ల ప్రత్యేకంగా బిజెపికి ఓటేయాల్సిన అవసరం లేదని కూడా వారి మనోగతమై ఉంటుంది. అందువల్ల బిజెపి పూర్తిగా తన ఎజెండాను మార్చుకుంటే తప్ప రాజకీయంగా తిరిగి ప్రాణం పోసుకునే పరిస్థితులు లేవు. ఇదే పద్ధతి కొనసాగితే తిరిగి కాంగ్రెసు ఏకపార్టీ స్వామ్య పునరుద్ధరణ జరిగినా ఆశ్చర్యం లేదు.