Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ కు పొంచి ఉన్న ముప్పు

YS Rajasekhar Reddy
లోకసభకు, శాసనసభకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెసు విజయం ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఘన విజయమేమీ కాదనే మాట వినిపిస్తోంది. లోకసభకు సాధించిన సీట్ల వల్ల వైయస్ రాజశేఖర రెడ్డి వెలిగిపోతున్నారు గానీ రాష్ట్ర శాసనభకు దక్కిన సీట్లను చూసుకుంటే ఆయన వెలుగు మసకబారినట్లేనని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా యుపిఎకు ప్రజల అనుకూలతే చాలా వరకు రాష్ట్రంలో వైయస్ కు కలిసి వచ్చిందని చెప్పాలి. లోకసభకు రాష్ట్రం నుంచి 33 సీట్లు దక్కడమే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వైయస్ కు మెజారిటీ రావడానికి కారణమనే విశ్లేషణ ముందుకు వస్తోంది. 294 ఆసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెసు 157 స్థానాలను మాత్రమే దక్కించుకుని బొటాబొటీ మెజారిటీ సాధించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సహా పలువురు హేమాహేమీలు, మంత్రులు ఓటమి పాలవడాన్ని చూస్తే కాంగ్రెసుకు రాష్ట్రంలో ఎదురైన ఎదురుగాలి అర్థం చేసుకోవచ్చు.

2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు తిరుగులేని మెజారిటీని సాధించింది. ఈ ఎన్నికల్లో 77 సీట్లను కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ తన శాసనసభ్యల సంఖ్యను రెండింతలు పెంచుకుంది.2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 47 సీట్లను మాత్రమే సాధించగా ఈసారి 93 స్థానాలు సాధించింది. మహాకూటమి పొరపాటు వల్ల తాము అధికారంలోకి రాలేకపోయామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నప్పటికీ లోకసత్తా, ప్రజారాజ్యం పార్టీల వల్ల జరిగిన నష్టాన్ని ఆయన పరిగణనలోకి తీసుకోలేకపోతున్నారు. ఆ పార్టీల స్వరూప స్వభావాలను, వ్యవస్థాగత పద్ధతి అంతా తెలుగుదేశం ఓటు బ్యాంకును చీల్చేవిగానే ఉన్నాయి గానీ కాంగ్రెసును నష్టపరిచేవిగా లేవు.

ప్రజారాజ్యం పార్టీ ఉప్పెనలా వచ్చి చిరుగాలిలా తేలిపోయింది. కుల సమీకరణాల వల్ల చిరంజీవి పార్టీ చతికిలపడిపోయింది. తెలుగుదేశం పార్టీ మిత్ర పక్షాలు సిపిఎం, సిపిఐ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఈ ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని చవి చూశాయి. మహా కూటమిలోనే పెద్ద తప్పుందనే విషయాన్ని కమ్యూనిస్టులు గానీ, తెలుగుదేశం గానీ గుర్తించలేకపోతున్నాయి. తమ తప్పిదాలను తెరాస మీదికి నెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తెరాసను తెర వెనక నుంచి దెబ్బ తీసే ప్రయత్నాల వల్లనే ఆ పార్టీలు అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాయి. తెరాస 10 అసెంబ్లీ స్థానాలను, రెండు లోకసభ స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. సిపిఐ నాలుగు శాసనసభా స్థానాలను గెలుచుకోగా, సిపిఎం ఒక్క స్థానాన్ని మాత్రమే సాధించింది. లోకసభ స్థానాలను ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు చర్యలకు కాలం చెల్లుతుందనే విషయాన్ని ఆ పార్టీలు గుర్తించే స్థితిలో లేవు. దేశవ్యాప్తంగా సిపిఎం, సిపిఐలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. అదే రీతిలో రాష్ట్రంలో ఆ పార్టీలు దెబ్బ తినడమే కాకుండా ఆ పార్టీలపై ఉన్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీపై కూడా పడింది. దాంతో తెలుగుదేశం, తెరాసలకు లోకసభ స్థానాలు తగ్గాయి.

దేశ పరిణామాల కారణంగానే కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలోని 42 లోకసభ స్థానాల్లో 33 స్థానాలను గెలుచుకుంది. రాష్ట్ర శాసనసభలో మాత్రం ఆ మేరకు సత్తాను చాటలేకపోయింది. కాంగ్రెసు 294 స్థానాల్లో కేవలం 157 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. గతంలో సాధించిన సీట్లలో 73 స్థానాలను కోల్పోయింది. తెలంగాణలో క్రాస్ ఓటింగ్ వల్ల, ఇతర స్థానిక కారణాల వల్ల శాసనసభలో కాంగ్రెసు బలం తగ్గినట్లు అంచనా వేస్తున్నారు. కానీ తెలంగాణ వాదం బలం వల్ల ఇక్కడ ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో పాటు డజను మంది మంత్రులు ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన మంత్రుల్లో ఎనమండుగురు తెలంగాణకు చెందినవారే. మంత్రులు షబ్బీర్ అలీ, టి. జీవన్ రెడ్డి, జి. చిన్నారెడ్డి, జి. వినోద్, ఫరీదుద్దీన్, ఎస్. చంద్రశేఖర్, జె రత్నాకర్ రావు, డిఎస్ రెడ్యా నాయక్ తెలంగాణకు చెందినవారు. వీరంతా తెలంగాణ వాదాన్ని తమ సొంత ప్రయోజనాలకు వాడుకుని వైయస్ రాజశేఖర రెడ్డికి వంత పాడినవారే. స్పీకర్ కె. సురేష్ రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ లోకసభ స్థానం పరిధిలోని పలువురు కాంగ్రెసు అభ్యర్థులు ఓటమి పాలు కాగా నిజామాబాద్ కాంగ్రెసు లోకసభ అభ్యర్థి మధుయాష్కీ మాత్రం విజయం సాధించారు. రాజశేఖర రెడ్డిని కూడా వ్యతిరేకిస్తూ తెలంగాణ వాణిని వినిపిస్తున్న నాయకుడు ఆయనొక్కరే. ఓటమి పాలైన ఆంధ్ర మంత్రులు పి. వెంకటేశ్వరరావు, ఎన్. రాజ్యలక్ష్మి, మండలి బుద్ధప్రసాద్. రాయలసీమకు చెందిన మంత్రుల్లో ఆర్ చెంగారెడ్డి ఒక్కరే ఓటమి చెందారు.

కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఖమ్మం లోకసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు జె. వెంకటరావు వ్యతిరేకత వల్ల ఓడిపోయారు. వెంకటరావుకు శాసనసభ టికెట్ ఇవ్వకపోవడమే ఆమె ఓటమికి కారణం.

1989 ఎన్నికలతో పోల్చుకుంటే 2004 ఎన్నికల్లో కాంగ్రెసు బలం తగ్గినపోయినట్లే తెలుస్తుంది. ఈసారి ఆ బలం మరింత తగ్గిందనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభలు తగ్గినట్లే భావించాలి. తెలంగాణలో హేమాహేమీల ఓటమి భవిష్యత్తులో వైయస్ రాజశేఖర రెడ్డికి గడ్డు పరిస్థితులను కల్పించే ప్రమాదం కూడా లేకపోలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+