వైయస్ జగన్ 'అవుట్'

ప్రధాని మన్మోహన్ సింగ్ యుపిఎ పార్లమెంటు సభ్యులకు బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఈ విందులో వైయస్ జగన్ సోనియాతో మాట్లాడడానికి శతవిధాలా ప్రయత్నించారు. అయితే ఆమె జగన్ కు మొహం చాటేశారు. ఈ విందులో కాస్తా ఖాళీగా కనిపించిన సోనియా వద్దకు టి. సుబ్బిరామిరెడ్డి జగన్ ను తీసుకుని వెళ్లారు. ఇది గమనించిన సోనియా వేరే వారితో మాట కలుపుతూ వారి వైపు కూడా చూడలేదు. సోనియా మాట్లాడతారేమోనని రెండు నిమిషాల పాటు నిరీక్షించారు. ఆమె ముఖం తిప్పకపోవడంతో జగన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీన్ని బట్టి జగన్ పట్ల సోనియా వైఖరి తేటతెల్లమైందని పార్టీ వర్గాలంటున్నాయి.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మీది గౌరవంతో ఇచ్చిన గుర్తింపును జగన్ దుర్వ్యినియోగం చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ అధిష్టానంలో చోటు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కావాలనే అత్యాశతో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే అభిప్రాయం బలంగా నాటుకుందని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెసులో సమైక్యాంధ్ర నినాదంతో రోడ్డెక్తిన సీమాంధ్ర శాసనసభ్యులు, మంత్రుల్లో ఎక్కువ మంది జగన్ మద్దతుదారులనే భావన కూడా అధిష్టానంలో ఉంది. అందువల్ల సమైక్యాంధ్ర నినాదాన్ని అధిష్టానం పెద్దగా పట్టించుకునే స్థితిలో లేదు. తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులతో కలసి తెలంగాణ ప్రకటనను ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని సృష్టించడంలో జగన్ పూనుకున్నట్లు భావిస్తున్నారు. అందుకు ఆధారం దొరకడంతో జగన్ ను గుర్తించడానికి కూడా సోనియా ఇష్టపడం లేదని అంటున్నారు.
తెలుగుదేశం సభ్యులతో కలసి లోకసభలో జగన్ చేసిన సమైక్యాంధ్ర నినాదం జగన్ కొంప ముంచింది. జగన్ సేవియర్ లా వ్యవహరించినట్లు చెప్పడాన్ని కూడా అధిష్టానం సహించడం లేదు. లోకసభలో తన ప్రవర్తనకు చెప్పుకున్న కారణం పట్ల కూడా అధిష్టానం ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆగ్రహం చల్లారకపోవడంతో ఆయన బుధవారం సాయంత్రం తన పత్రిక సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చుకున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తిగా ఆత్మరక్షణలో పడినందు వల్లనే జగన్ తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చేస్తున్నారు. అయితే జగన్ నమ్మడానికి సోనియా ఏ మాత్రం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications